Gakari on Flex Fuel Engine | సుప్రీంకోర్టు అనుమతి రాగానే అన్ని వాహనాల్లో ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్లను తయారు చేయడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. వచ్చే మూడేండ్లలో ఢిల్లీని వాయు, జల, శబ్ధ కాలుష్య రహిత నగరంగా తీర్చి దిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అమెరికాతోపాటు కెనడా, బ్రెజిల్లలోని ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్లు గల వాహనాలను తయారు చేస్తున్నాయని గుర్తు చేశారు.
గురువారం ఆయన పీహెచ్డీసీసీఐ వార్షిక సదస్సులో మాట్లాడుతూ పై విధంగా అన్నారు. ఫ్లెక్సీ ఫ్యూయల్తో కూడిన ఇంజిన్ గల వాహనాల తయారీకి అనుమతించే విషయమై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లు గల వాహనాల తయారీ తప్పనిసరి చేస్తూ ఆదేశాలిస్తామని చెప్పారు.
పెట్రోల్లో ఇథనాల్ లేదా మిథనాల్ కలిపితే లభించే ఆయిల్.. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్.. ఫ్లెక్సీ ఫ్యూయల్ అవుతుంది. ఇథనాల్ ఎకానమీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని గడ్కరీ తెలిపారు. 450 కంపెనీలు ఇథనాల్ తయారీకి ఆసక్తి చూపాయని చెప్పారు. పెట్రోల్, డీజిల్ కంటే ఇథనాల్ ఎంతో చౌక అని అన్నారు.