Relief For Future | రిలయన్స్ రిటైల్లో విలీనం విషయమై ఫ్యూచర్ గ్రూప్ సంస్థకు రిలీఫ్ లభించింది. రిలయన్స్లో విలీనంపై ఫ్యూచర్ గ్రూప్ వాటాదారుల సమావేశం నిర్వహించుకునేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మంగళవారం అనుమతించింది. రిలయన్స్లో ఫ్యూచర్ గ్రూప్ సంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్లు సుచిత్ర కానుపర్తి, చంద్రభాన్సింగ్లతో కూడిన ముంబైలోని ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్టీ ధర్మాసనం తిరస్కరించిందని అధికార వర్గాల కథనం. దీనిపై స్పందించేందుకు అమెజాన్, ఫ్యూచర్ ముందుకు రాలేదు.
దీనిపై అమెజాన్ పిటిషన్ తొందరపాటు నిర్ణయం అని ఎన్సీఎల్టీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రిలయన్స్లో ఫ్యూచర్ విలీనాన్ని సుప్రీంకోర్టు మాత్రమే నిలువరించగలదని అన్నట్లు సమాచారం. తాజా పరిణామంతో రిలయన్స్ రిటైల్లో తమ సంస్థ విలీనానికి వాటాదారులు, బ్యాంకుల ఆమోదానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఫ్యూచర్ రిటైల్ గ్రూప్కు వీలు కలుగుతుంది. తద్వారా రిలయన్స్లో విలీనంపై ఫ్యూచర్కు మరో 6-9 నెలల సమయం లభించినట్లయింది.
గతేడాది ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో ఫ్యూచర్ గ్రూప్ రూ.24,713 కోట్ల మొత్తానికి విలీనం చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీన్ని ఫ్యూచర్ కూపన్స్లో ఇన్వెస్టర్గా, ఫ్యూచర్ రిటైల్ వాటాదారుగా అమెజాన్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
2019 ఆగస్టులో ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసినప్పుడు కుదిరిన ఒప్పందంలో మూడేండ్ల నుంచి 10 ఏండ్లలోపు ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు చేసే హక్కుకు అమెజాన్కు దఖలు పడింది. ఈ అంశంపై సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ముందు అమెజాన్ పిటిషన్ దాఖలు చేసింది. గత అక్టోబర్లో తుది ఆదేశాలు జారీ చేసే వరకు రిలయన్స్లో విలీనంపై ముందుకెళ్లొద్దని ఫ్యూచర్ను సింగపూర్ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.