న్యూఢిల్లీ, మార్చి 15: కరోనా సంక్షోభం మానవాళికి ఎన్నో తీవ్రమైన సమస్యలను సృష్టించినప్పటికీ భారతీయుల్లో దాతృత్వ గుణం అంతకంటే అధిక స్థాయిలో గుబాళించింది. దీంతో 2020 ఆర్థిక సంవత్సరంలో కుటుంబ విరాళాలు మూడు రెట్లు పెరిగి దాదాపు రూ.12 వేల కోట్లకు చేరినట్లు ఓ నివేదిక వెల్లడించింది. బైన్స్ అండ్ కంపెనీ, దస్రా రూపొందించిన భారత దాతృత్వ నివేదిక-2021 ప్రకారం.. 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగం (విదేశీ, కార్పొరేట్, రిటైల్, అధిక నికర సంపద కలిగిన వ్యక్తులు లేదా కుటుంబాల) నుంచి వచ్చిన మొత్తం విరాళాలు దాదాపు రూ.64 వేల కోట్లు. వీటిలో 20 శాతం విరాళాలు కుటుంబాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. మొత్తం విరాళాల్లో విదేశీ విరాళాలు 25 శాతం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)గా దేశీయ కార్పొరేట్ విరాళాలు 28 శాతం, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన విరాళాలు 28 శాతం ఉన్నాయి.