న్యూఢిల్లీ, జూలై 31: బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆదివారం నుంచి జీతాలు, పింఛన్లు, ఈఎంఐ రూల్స్ మారాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (నాచ్) సేవలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 1 నుంచి నిరంతరం చేసింది. దీంతో ఇక బ్యాంకింగ్ పనిదినాలతో నిమిత్తం లేకుండా ఉద్యోగులకు జీతాలు, అర్హులకు పింఛన్లు, రుణగ్రహీతల ఈఎంఐలు ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే క్రెడిట్, డెబిట్ అవుతాయి. ప్రస్తుతం ఆయా తేదీల్లో సెలవులుంటే ముందుగానో, ఆలస్యంగానో ఈ లావాదేవీలు జరుగుతున్నాయి.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) కొత్త చార్జీలు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. హోం బ్యాంకింగ్ సర్వీస్ కోరుకున్న కస్టమర్ల నుంచి రూ.20 (జీఎస్టీ అదనం) వసూలు చేయనున్నారు. ఖాతాదారుల ఇంటికి పోస్ట్మ్యాన్ లేదా గ్రామీణ్ డాక్ సేవక్ వచ్చి ఈ డోర్స్టెప్ బ్యాంకింగ్ (డీఎస్బీ) సర్వీస్ అందిస్తారు. ఖాతాదారుడు ఎన్ని లావాదేవీలనైనా జరుపుకోవచ్చు. చార్జీల్లో మార్పుండదు. అయితే ఒకే చోట ఇద్దరు, అంతకంటే ఎక్కువ కస్టమర్లుండి సర్వీస్ను పొందితే, అందరి దగ్గర్నుంచీ రూ.20, జీఎస్టీ వసూలు చేస్తారు.
ఏటీఎం లావాదేవీలపై ఇంటర్చేంజ్ ఫీజులూ ఆదివారం నుంచే పెరిగాయి. రూ.15 నుంచి 17కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక లావాదేవీలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎం నుంచి కాకుండా ఇతర బ్యాంక్ల ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేసినప్పుడు సదరు కస్టమర్ల నుంచి బ్యాంక్లు ఈ ఫీజులను వసూలు చేస్తాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ సైతం ఆగస్టు 1 నుంచే నగదు లావాదేవీలపై పరిమితులను సవరించింది. తమ దేశీయ సేవింగ్స్ ఖాతాదారుల ఏటీఎం ఇంటర్చేంజ్, చెక్బుక్ చార్జీల్లోనూ మార్పులు చేసింది. మెట్రో నగరాల్లో మూడు, ఇతర నగరాల్లో ఐదు చొప్పున ఉచిత లావాదేవీలను ఖాతాదారులు పొందవచ్చని, ఆ తర్వాత ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.20, ఆర్థికేతర లావాదేవీకి రూ.8.5 చొప్పున చార్జీలుంటాయని బ్యాంక్ స్పష్టం చేసింది.