న్యూఢిల్లీ: భారతీయ వాయుసేన (ఐఏఎఫ్)ను పటిష్ఠ పరిచేందుకు 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థ దస్సాల్ట్ భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ను ఎంచుకోవడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. రిలయన్స్ ఫ్యామిలీకి చెందిన అనిల్ అంబానీకి చెందిందే రిలయన్స్ డిఫెన్స్. ఈ సంస్థకు ఏ అనుభవం లేకున్నా.. ఎలా కేటాయించారని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని విపక్ష పార్టీలు నిలదీశాయి.
కానీ ఇదంతా వట్టి పసలేని ఆరోపణలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కొట్టి పారేశాయి. కానీ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఫ్రాంకోయిస్ హోలాండే.. భారత ప్రభుత్వ ఒత్తిడి మేరకే రిలయన్స్ డిఫెన్స్ను తన భాగస్వామిగా దస్సాల్ట్ ఎంచుకున్నదని అన్నట్లు ఫ్రాన్స్ ఇన్వెస్టిగేటివ్ వైబ్సైట్ మీడియా పార్ట్ వెల్లడించింది. తమకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని హోలండే చెప్పారని సమాచారం.
వాస్తవంగా మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో దస్సాల్ట్ భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ని ఖరారు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కాదని ప్రైవేట్ సంస్థను ఎలా భాగస్వామిని చేశారని విపక్షాలు ప్రశ్నించాయి.
ఒప్పందం ఖరారు సమయంలో పలువురికి ముడుపులు ఇచ్చినట్లు పేర్కొంది. భారత్లోనూ ఓ మధ్యవర్తికి దాదాపు రూ.8.6 కోట్ల కమీషన్ అందించినట్లు విచారణలో వెల్లడైందని తెలిపింది. వీవీఐపీ చూపర్ కుంభకోణంలో ఈ మధ్యవర్తిని ఈడీ అరెస్ట్ చేయడం గమనార్హం.
ఈ ఒప్పందం ఖరారులో కొంతమందికి కావాలనే అనుకూలంగా వ్యవహరించినట్లు మీడియా పార్ట్ తన వరుస కథనాల్లో తెలిపింది. ఈ సంగతి అప్పటి ఫ్రెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ చీఫ్ హ్యూలెట్ దృష్టికి వచ్చినా విచారణను పక్కకు పెట్టేశారని ఆరోపించింది.
ప్రభుత్వాల స్థాయిలో ఒప్పందాలు జరిగినందున అవినీతి, అవకతవకలు బహిర్గతమైతే దేశానికే అప్రతిష్ఠ వచ్చే అవకాశం ఉందని చెప్పి.. హ్యులెట్ తన సహచరులకు నచ్చ చెప్పారని సమాచారం.
జ్యుడీషియల్ విచారణకు ప్రాన్స్ జారీ చేసిన ఆదేశాలపై దస్సాల్ట్ స్పందించలేదు. ఒప్పందాల ఖరారుపై ఎటువంటి తప్పుడు విధానాలు అవలంభించలేదని గతంలో పేర్కొంది.