న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారత్కు మరో అమెరికా ఆటో సంస్థ షాకిచ్చింది. ఫోర్డ్ మోటర్ కంపెనీ.. దేశంలో వాహన తయారీకి గుడ్బై చెప్పేస్తున్నది. ఇక్కడ సంస్థకున్న రెండు ఉత్పాదక కేంద్రాలను మూసివేయనున్నది. ఇకపై విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాలనే భారతీయ మార్కెట్లో విక్రయించనున్నది. ఈ మేర కు గురువారం ఫోర్డ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసిం ది. నాలుగేండ్ల క్రితం జనరల్ మోటర్స్ సైతం భారత్ను విడిచి పెట్టగా, ఇప్పుడు పునర్నిర్మాణ ప్రక్రియ పేరుతో ఫోర్డ్ అదే బాటలో నడుస్తున్నది. కాగా, ఫోర్డ్ మోటర్కు చెన్నై (తమిళనాడు), సనంద్ (గుజరాత్)లలో కార్ల తయారీ కేంద్రాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్కల్లా సనంద్ ప్లాంట్, వచ్చే ఏడాది జూన్ ఆఖరు నాటికి చెన్నై ప్లాంట్లో ఉత్పత్తిని ఆపేస్తామని తాజా ప్రకటనలో ఫోర్డ్ వెల్లడించింది. అయితే విదేశీ అవసరాల కోసం సనంద్ ప్లాంట్లో ఇంజిన్లను తయారుచేసి ఎగుమతి చేస్తామని పేర్కొన్నది. అయినప్పటికీ సంస్థ తీసుకున్న నిర్ణయంతో 4వేలకుపైగా ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకమవుతున్నది. దేశీయంగా సంస్థకు 150 డీలర్షిప్లు.. వారి ఆధ్వర్యంలో 300లకుపైగా ఔట్లెట్లున్నాయి.
ఆగనున్న ఎకోస్పోర్ట్, ఫిగో, ఎండీవర్
చెన్నై, సనంద్ ప్లాంట్లను ఫోర్డ్ మూసివేస్తే మార్కెట్లో ఎకోస్పోర్ట్, ఫిగో, ఎండీవర్, ఫ్రీైస్టెల్, అస్పైర్ కార్లు కనుమరుగైపోనున్నాయి. ప్రస్తుతం ఈ మోడల్స్ ఈ ప్లాంట్లలోనే తయారవుతున్నాయి. అవి మూతబడితే ఈ పాపులర్ కార్ల అమ్మకాలకూ కాలం తీరినట్లేనని అంటున్నారు. మున్ముందు దేశీయ మార్కెట్లో దిగుమతి చేసుకునే ముస్తంగ్ వంటి వాహనాలనే ఫోర్డ్ విక్రయించే వీలుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి దేశీయ ప్లాంట్లలో తయారైన ఫిగో, అస్పైర్, ఎకోస్పోర్ట్ వంటి మోడల్స్ను ఫోర్డ్.. ప్రపంచవ్యాప్తంగా 70కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నది. కాగా, ఫోర్డ్ భారతీయ ప్లాంట్లపై 2.5 బిలియన్ డాలర్ల (రూ. 18,400 కోట్లు) పెట్టుబడుల్ని పెట్టింది. వీటి వార్షిక సామర్థ్యం 4.4 లక్షల వాహనాలు, 6.1 లక్షల ఇంజిన్ల ఉత్పత్తిగా ఉన్న ది. దేశీయ మార్కెట్లో 1.57% వాటా తో ఫోర్డ్కు 9వ స్థానం ఉన్నది.
రూ.15వేల కోట్ల నష్టాలు
భారీ నష్టాలు, మార్కెట్లో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులే ఫోర్డ్ ప్లాంట్ల మూసివేత నిర్ణయం వెనుక ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కరోనా నేపథ్యంలో అంచనాలకు తగ్గట్లుగా కొత్త వాహన విక్రయాలూ జరుగడం లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా భారతీయ మార్కెట్లో నిలదొక్కుకోవాలని ఫోర్డ్ ప్రయత్నిస్తున్నది. అయితే గత పదేండ్లుగా సంస్థకు వాటిల్లుతున్న నిర్వహణ నష్టాలు.. ఇక ఈ ప్రయత్నాలకు ముగింపు పలికేలా చేశాయి. గడిచిన పదేండ్లలో ఫోర్డ్ దాదాపు 2 బిలియన్ డాలర్ల (రూ.15,000 కోట్లు) నష్టాలను చవిచూసింది. ‘మా ఫోర్డ్+ ప్లాన్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. దీర్ఘకాలంలో నిలకడైన లాభదాయక వ్యాపార నిర్మాణానికి కావాల్సిన చర్యల్ని కొనసాగిస్తాం. పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరుగుతున్నది’
-జిమ్ ఫార్లే, ఫోర్డ్ మోటర్ అధ్యక్షుడు, సీఈవో