న్యూఢిల్లీ: సరిగ్గా ఏడేండ్ల క్రితం 2014లో ప్రతి న్యూ మోడల్ కారుతోపాటు పాతకారు అమ్ముడయ్యేది. కానీ క్రమేణా పరిస్థితుల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి.
2019లో ఆర్థిక మందగమనం, 2020 నుంచి కరోనా మహమ్మారి ప్రభావం నేపథ్యంలో పర్సనల్ మొబిలిటీకి ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. చౌక ధరలో వచ్చే కారు వైపు మొగ్గు చూపుతున్నారు.
2020-21లో 44 లక్షల పాత కార్లు అమ్ముడైతే 27 లక్షల నూతన కార్లు అమ్ముడయ్యాయి. 2019-20లో పాత కార్ల విక్రయం 42 లక్షలుగా ఉంది.
సరఫరా చెయిన్లో అవరోధాల వల్ల న్యూ కారు మార్కెట్ పడిపోయి.. యూస్డ్ కార్ల మార్కెట్ పుంజుకోవడం సవాల్గా పరిణమిస్తున్నది.
ప్రతి ఒక్కరూ కొత్త కారు కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చినా కరోనా వేళ నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో సేఫ్ మార్గం అన్వేషిస్తున్నారు. పాత కారు కొంటే 60-70 శాతం బడ్జెట్ తగ్గుతుంది. పాత కారు కొనే వారిలో దాదాపు 50 % మంది ఫస్ట్టైం బయ్యర్లే.
ఇప్పటివరకు పాత కార్ల విక్రయ బిజినెస్ అంతా అసంఘటిత రంగంలోనే ఉంది. కేవలం 15 శాతం మాత్రమే కార్ల తయారీ సంస్థల పర్యవేక్షణలో సాగుతున్నది.
మారుతి సుజుకి సారధ్యంలోని ట్రూ వాల్యూ, మహీంద్రా ఫస్ట్ చాయిస్, హ్యుండాయ్ ప్రామిస్, హోండా ఆటో టెర్రస్, తదితర పేర్లతో కార్ల తయారీ సంస్థలు పాత కార్ల విక్రయాలు సాగిస్తున్నాయి.
మారుతి ట్రూ వాల్యూ ఆధ్వర్వ్యంలో పాత కార్ల కొనుగోళ్లలో గత ఆర్థిక సంవత్సరం 6% గ్రోత్ నమోదైంది.
మొత్తం పాత కార్ల కోసం జరిపిన ఎంక్వయిరీల్లో 67 శాతం మారుతి ట్రూ వాల్యూకే వచ్చాయని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
భారత్లో పాత కార్ల మార్కెట్ 2030 నాటికి 70.8 బిలియన్ల డాలర్లకు చేరుతుందని పీ అండ్ ఎస్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది.
దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూర్ నగరాలు పాత కార్ల విక్రయాలకు కేంద్రంగా నిలిచాయి. రూ. 2 లక్షల విలువైన కార్ల నుంచి రూ.6 లక్షల వరకు.. కొన్ని కేసుల్లో రూ.15 లక్షల వరకు ఖర్చు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
కోవిడ్-19 నేపథ్యంలో స్వయం ఉపాధి పొందుతున్న వారిలో కార్ల కొనుగోళ్లు పెరిగాయి.
వేతన జీవులు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి వర్క్ ఫ్రం హోం కల్చర్ కూడా ఒక కారణమే కావచ్చు.
2019-20తో పోలిస్తే 2020-21లో పాతకారును ఫస్ట్టైం కొనుగోలు చేసిన వారు తగ్గారు. 2019-20లో 80 శాతం ఉంటే 2020-21లో అది 57 శాతానికి పరిమితమైంది. దీనికి భిన్నంగా అదనపు కారు కొనే వారు 14 నుంచి 36 శాతం పెరిగారు.
95 శాతం మంది రూ.5 లక్షల్లోపు విలువ గల మారుతి కార్లు కొంటున్నారు. రూ.5-7 లక్షల్లోపు విలువ గల మహీంద్రా పాత కార్లు అమ్ముడవుతున్నాయి.పాత కార్ల మార్కెట్ ముంగిట సవాళ్లు ఉన్నాయి.
పాత కార్ల వాడకాన్ని నిరుత్సాహ పరిచేందుకు కేంద్రం వాటి రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఫీజును ఎనిమిది రెట్లు పెంచేసింది.
ప్రస్తుతం కారు రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఫీజు రూ.5000 ఉంటే.. కొత్త చట్టం వస్తే 15 ఏండ్లు దాటిన కార్లపై రూ.40 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. గ్రీన్ టాక్స్ కూడా చెల్లించాల్సి వస్తుంది.
రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఫీజు పెంచడం వల్ల పాత కార్ల కొనుగోలుకు డిమాండ్ తగ్గుముఖం పడుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 10 ఏండ్లు దాటిన పాత కార్ల విక్రయంపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చు.