ఆక్సిజన్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షణ
రోజుకు 15 నుంచి 20 సిలిండర్లు సరఫరా
నిర్మల్ దవాఖానలో అన్ని రకాల ఏర్పాట్లు
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 30 : నిర్మల్ జిల్లాలోని ప్రధాన దవాఖానలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఈ మేరకు నిత్యం పర్యవేక్షిస్తుండగా, ముఖ్యంగా ఆక్సిజన్ కొరతలేకుండా చూస్తున్నారు. నిజామాబాద్ నుంచి నిత్యం 15 నుంచి 20 సిలిండర్లు సరఫరా చేసేలా అక్కడి కలెక్టర్తో మాట్లాడిన అమాత్యుడు, మెరుగైన సేవలందించేలా ఇక్కడి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
జిల్లాలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకొని మంత్రి అల్లోల, నిజామాబాద్ కలెక్టర్తో మాట్లాడి ప్రతి రోజూ 15-20 సిలిండర్లు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దవాఖానలో 35 ఆక్సిజన్, 10 ఐసీయూ, 20 జనరల్ బెడ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం అందుబాటులో ఉన్నదని తెలిపారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూడడంతో పాటు వారికి వైద్యం అందించేందుకు కావాల్సిన పూర్తి సదుపాయాలు కల్పిస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డికి దవాఖాన వైద్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.