గిడ్డంగి సామర్థ్యాన్ని మరింత పెంచుతున్న ఈ కామర్స్ సంస్థ
నిత్యావసరాల పంపిణీ వ్యవస్థ బలోపేతానికి దేశంలో స్టోరేజీలు
న్యూఢిల్లీ, మే 11: ఈ-కామర్స్ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్.. హైదరాబాద్లో తమ గిడ్డంగిని మరింత విస్తరించనున్నది. రాబోయే మూడు నెలల్లో దేశవ్యాప్తంగా గిడ్డంగుల సామర్థ్యాన్ని 8 లక్షల చదరపు అడుగులకుపైగా పెంచాలని చూస్తున్న ఫ్లిప్కార్ట్.. ఇందులో భాగంగానే హైదరాబాద్ గిడ్డంగినీ విస్తరించాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్తోపాటు ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరు, కోల్కతా నగరాల్లోని ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల సామర్థ్యాన్ని పెంచనున్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశవ్యాప్తంగా ఫ్లిప్కార్ట్కు 15 గిడ్డంగులుండగా, వీటి నిల్వ సామర్థ్యం 25 లక్షల క్యుబిక్ ఫీట్లు. రోజురోజుకూ సంప్రదాయ మార్కెట్ను వెనక్కినెట్టి ఆన్లైన్ మార్కెట్ దూసుకుపోతున్న నేపథ్యంలో మరింతమంది కస్టమర్లకు సేవలందించడంపై ఈ వాల్మార్ట్ అనుబంధ సంస్థ దృష్టి పెట్టింది. ముఖ్యంగా పెరుగుతున్న నిత్యావసరాల డిమాండ్కు తగ్గట్లుగా గిడ్డంగులను పెద్దవిగా చేయాలనుకుంటున్నామని మంగళవారం ఓ ప్రకటనలో ఫ్లిప్కార్ట్ స్పష్టం చేసింది. అందుకే హైదరాబాద్సహా ఆయా నగరాల్లో అనుబంధంగా మరో ఐదు కొత్త ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అదనంగా అందుబాటులోకి వచ్చే స్థలంతో రోజుకు 73వేలకుపైగా గ్రాసరీ ఆర్డర్లకు సర్వీస్ ఇవ్వగలమని ఫ్లిప్కార్ట్ చెప్తున్నది. ప్రస్తుతం దాదాపు 64వేల ఆర్డర్లనే తీసుకోగలుగుతున్నారు.
కరోనా నేపథ్యంలో..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో కస్టమర్లకు సురక్షితంగా కావాల్సిన వస్తూత్పత్తులను సరఫరా చేయడానికే ఫ్లిప్కార్ట్ అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అందుకే గడిచిన నెల రోజుల్లో హైదరాబాద్తోపాటు పలు నగరాల్లోని గిడ్డంగుల్లో నిత్యావసరాల నిల్వల్ని పెంచింది. అంతేగాక ప్రత్యేకంగా హైదరాబాద్, ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, పుణె నగరాలకు తమ హైపర్లోకల్ సర్వీస్ ‘ఫ్లిప్కార్ట్ క్విక్’ను విస్తరించింది. దీంతో ఈ నగరాల్లోని వినియోగదారులకు పండ్లు, కూరగాయలు తదితర నిత్యావసర సరుకులు ఆర్డర్ చేసిన 90 నిమిషాల్లోగా అందుతున్నాయి. 200లకుపైగా రకాలైన 7వేలకుపైగా ఉత్పత్తులను ఫ్లిప్కార్ట్ గ్రాసరీ విక్రయిస్తున్నదని ఈ విభాగం ఉపాధ్యక్షురాలు స్మృతి రవిచంద్రన్ తెలిపారు.