అక్టోబర్ 1 నుంచి బ్యాంకులకు ఫైన్ విధించనున్న ఆర్బీఐ
ముంబై, ఆగస్టు 10: ఏటీఎంల్లో నగదు కొరతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్రంగా స్పందించింది. ఏటీఎంలో నగదు లేకపోతే ఆ బ్యాంక్పై రూ.10,000 చొప్పున జరిమానా వేస్తామని ప్రకటించింది. ఖాళీ ఏటీఎంలు.. బ్యాంక్ ఖాతాదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న దృష్ట్యా ఆర్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలోనే అక్టోబర్ 1 నుంచి ఏటీఎంల్లో ఎప్పటికప్పుడు నగదును నింపాల్సిందేనని, లేనిపక్షంలో జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా విడుదల చేసిన ఓ సర్క్యులర్లో రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ‘నెలలో 10 గంటలకుపైగా ఏ ఏటీఎంలో నగదు లేకపోయినా రూ.10,000 జరిమానా విధిస్తాం. ఇలా ఎన్ని ఏటీఎంలు ఖాళీగా ఉంటే రూ.10,000 చొప్పున అన్ని జరిమానాలు తప్పవు’ అని అందులో పేర్కొన్నది. ఏటీఎంల ద్వారా ప్రజలకు నగదు అందాలి. అందుకు సరిపడా నగదును వాటిలో ఉంచాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగడానికే ఖాళీ ఏటీఎంలపై ఈ జరిమానాలను తెస్తున్నట్లు ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ఈ మేరకు ‘నగదు నిల్వలు లేని ఏటీఎంలపై జరిమానా పథకం’ను ప్రవేశపెట్టినట్లు తెలియజేసింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ స్కీం అమల్లోకి వస్తుందని చెప్పింది. కాబట్టి బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు ఏటీఎంలలో నగదు నిల్వలను పర్యవేక్షించుకోవాలని సూచించింది. కాగా, వైట్ లేబుల్ ఏటీఎంల విషయంలో బ్యాంకులకు పెనాల్టీ ఉండనున్నది. అయితే బ్యాంకులు సదరు ఏటీఎం ఆపరేటర్ నుంచి ఈ సొమ్మును వసూలు చేసుకునే అవకాశాలున్నాయి. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 2,13,766 ఏటీఎంలున్నాయి.