న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పంట రుణాల మాఫీ ఆలోచనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రం సోమవారం తేల్చి చెప్పింది. పంట రుణాల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని లోక్సభలో సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ చెప్పారు. నాబార్డ్ వద్ద ఉన్న డేటా ప్రకారం గత మార్చి నెలాఖరు నాటికి 13.85 కోట్ల ఖాతాల్లో రూ.16.80 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయన్నారు.
స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో గత 10 ఏండ్లలో నల్లధనం నిల్వల సమాచారంపై ఎటువంటి అధికారిక సమాచారం లేదని ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హెచ్ఎస్బీసీ బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాల్లో రూ.8,465 కోట్ల ఆదాయం ఉందని, వాటిపై రూ.1,294 కోట్ల జరిమానా విధించామని అన్నారు.
ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు (ఐసీజే) ఆధ్వర్యంలో గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాల్లో రూ.11,019 కోట్లు ఉన్నాయి. పనామా పేపర్స్ లీక్లో రూ.20,078 కోట్లు, ప్యారడైజ్ పేపర్ లీక్స్లో రూ.246 కోట్లు బయట పడ్డాయన్నారు.