కోల్కతా : ఈ దృశ్యాన్ని చూస్తే.. వారంతా కరోనా రోగులైనా ఉండాలి లేదా ఆరోగ్య సిబ్బంది అయి ఉండాలి అనుకుంటారు. కానీ వారంతా కౌంటింగ్ సిబ్బంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది కొవిడ్ నిబంధనలను పకడ్బందీగా పాటిస్తున్నారు. ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని రాయిగంజ్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద కౌంటింగ్ సిబ్బంది అందరూ పీపీఈ కిట్లను ధరించారు. ఆ తర్వాతే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓట్లను లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు.
పశ్చిమ బెంగాల్ ఓట్ల లెక్కింపు పటిష్ట బందోబస్తు మధ్య కొనసాగుతోంది. మొత్తం 23 జిల్లాలో 108 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. అన్ని కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులను భారీగా మోహరించారు. 256 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయి. 292 మంది అబ్జర్వర్లను నియమించారు. 294 శాసనసభ స్థానాలకు గానూ 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా రెండు స్థానాల అభ్యర్థులు చనిపోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.