నల్లగొండ ప్రతినిధి, మార్చి22 (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ మహమ్మారి మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక స్థితిగతులన్నీ తలకిందులవుతున్నాయి. సరిగ్గా ఏడాది కిందట అమలైన లాక్డౌన్తో రావాల్సిన ఆదాయం కుప్పకూలింది. ప్రభుత్వానికి సంక్షోభ కాలం ఎదురైంది. సర్వం మూత పడడంతో పథకాల మనుగడే ప్రశ్నార్థకమవ్వగా… విపత్కర పరిస్థితులను సీఎం కేసీఆర్ గట్టిగా ఎదుర్కొన్నారు. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా 2021-2022 వార్షిక బడ్జెట్ను రూ.2లక్షల కోట్లు దాటించగా… తాజాగా ప్రభుత్వంలో భాగస్వామ్యమై పని చేస్తున్న ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు అందించారు. కొంత కాలంగా పీఆర్సీ ప్రకటనపై వేయి కండ్లతో వేచి చూస్తున్న వారందరికీ ఆశించిన స్థాయికి మించిన ప్రకటన రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్లిష్టమైన ఈ సమయంలో వేతనాల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నది. సంక్షోభ సమయంలో వెనుకడుగు వేయకుండా ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా జీతాలను పెంచి అందరి మెప్పు పొందుతున్నది. ఉత్కంఠకు తెరదించుతూ… 30శాతం ఫిట్మెంట్ ప్రకటన, ఉద్యోగ విరణ వయస్సు 61 ఏండ్లకు పెంచడంతో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.
ఎంప్లాయి ఫ్రెండ్లీ గవర్నమెంట్…
ఉద్యమాలతో తెచ్చుకున్న రాష్ట్రంలో పరిపాలన మొదలైన తొలి నాళ్లలో రాష్ట్ర సాధనలో ఉద్యోగులు పోషించిన పాత్రను సీఎం కేసీఆర్ గుర్తించారు. వారి పాత్రను అభినందిస్తూ ప్రభుత్వం స్పెషల్ ఇంక్రిమెంట్ను ప్రకటించింది. 2014లో పదవ వేతన సవరణ చేస్తూ 43శాతం అత్యధిక ఫిట్మెంట్ను ప్రకటించింది. రాష్ట్రంలోని ఉద్యోగులందరిపై తనకున్న అభిమానాన్ని ప్రభుత్వం చాటుకున్నది. కరోనా విపత్తు ఏకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. అనూహ్యంగా ఏర్పడిన ఆర్థిక లోటుతో వేతన సవరణ కాసింత ఆలస్యం కాగా … ఇప్పడిప్పుడే తేరుకుంటున్న సందర్భంలో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు వర్తించే విధంగా మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని యావత్తు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణ, సమస్యల పరిష్కారం కోసం సీఎం చేసిన ప్రకటనతో వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
రాష్ట్ర సాధనలో స్ఫూర్తివంతమైన భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధతతో పాలుపంచుకోవాలంటూ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సమయానుకూలంగా ఉద్యోగులతో ఫ్రెండ్లీగా మెదులుతున్న ప్రభుత్వం… ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగులందరి హక్కులను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నది.