ముంబై, సెప్టెంబర్ 3: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థికవేత్తలు.. ఓవరాల్గా ఈ ఆర్థిక సంవత్సరంలో లేబర్ మార్కెట్ కార్యకలాపాలు మెరుగ్గానే ఉంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ పరిస్థితుల ప్రభావం క్షీణిస్తున్న నేపథ్యంలో కంపెనీలు నియామకాలపై దృష్టి పెడుతున్నాయని చెప్తున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో), న్యూ పెన్షన్ స్కీంల పేరోల్ డాటా ఇందుకు అద్దం పడుతున్నాయని వారు గుర్తుచేస్తున్నారు. ‘ఆయా రంగాల్లోని సంస్థలు మళ్లీ ఉద్యోగులను తీసుకునే పనిలో పడుతున్నాయి. దీన్నిబట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లేబర్ మార్కెట్ కార్యకలాపాలు గతంతో పోల్చితే బాగుంటాయని మేము భావిస్తున్నాం’ అని ఎస్బీఐ ప్రధాన ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. అయితే ఆగస్టులో దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాల్లో 15 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారన్న సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనాల మధ్య ఎస్బీఐ ఆర్థికవేత్తల తాజా నివేదిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఒక్క గత నెలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షల మందికి ఉపాధి దూరమైనట్లు సీఎంఐఈ చెప్తున్నది.