హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన కంప్యూటింగ్ సొల్యూషన్స్ సంస్థ బ్లైజ్.. సిరీస్ డీ రౌండ్లో 71 మిలియన్ డాలర్ల (రూ.520 కోట్లకుపైగా)ను సమీకరించింది. కొత్త పెట్టుబడిదారు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్తోపాటు ప్రస్తుత భాగస్వామి టెమాసెక్, డెన్సో తదితర సంస్థలు ఈ రౌండ్కు నాయకత్వం వహించాయి. ఈ నిధులతో సంస్థ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు రాబోయే 12-18 నెలల్లో హైదరాబాద్లో తమ కార్యకలాపాలను వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రస్తుత తరం ఉత్పత్తులను వేగవంతం చేయడానికి, వినియోగదారులకు నిజమైన విలువను అందించే ఇంటిగ్రేటెడ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్లను అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బ్లైజ్ సీఈవో దినకర్ మునగాల తెలిపారు. ఆటోమోటివ్, స్మార్ట్ రిటైల్, స్మార్ట్ సిటీ, పారిశ్రామిక మార్కెట్లలో అధిక పనితీరు, తక్కువ శక్తి, పరిమిత ఖర్చుతో కూడిన ఏఐ హార్డ్వేర్, ఏఐ సాఫ్ట్వేర్ పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఈ నిధులు తోడ్పడతాయన్నారు. హార్డ్వేర్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెరిఫికేషన్, రీసెర్చ్, కస్టమర్ సర్వీసులలో ఇంజినీర్లు, ఏఐ టెక్నాలజీ నిపుణులను నియమించడం ద్వారా దేశంలో తమ ప్రతిభను చాటడానికి బ్లైజ్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. తమకు ఆటోమోటివ్, రిటైల్ తదితర రంగాల్లో విస్తరణకు అవకాశాలున్నాయన్నారు. ఎడ్జ్ కంప్యూటింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించుకునే సంస్థల సామర్థ్యం పెరగడానికి బ్లైజ్ తోడ్పాటునందిస్తుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేపీ స్కాండాలియోస్ తెలిపారు.