భారతదేశానికి పల్లెలే పట్టుగొమ్మలు.., గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధి..స్వాతంత్య్రానంతరం మన నాయకుల నుంచి వింటూ వస్తున్న నినాదాలు ఇవి. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచించారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఈ మాటల అవసరం ఇప్పటికీ పోలేదు. మారే పరిస్థితులూ కనిపించడం లేదు.
‘భారత బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్’
నివేదికల ప్రకారం దేశ ఆర్థికాభివృద్ధిలో 58 శాతాన్ని వ్యవసాయరంగమే అందిస్తున్నది. 2020 ఆర్థిక సంవత్సరం నాటికి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు కలిసి రూ.19.48 లక్షల కోట్లను ప్రభుత్వానికి సంపాదించి పెట్టాయి. గతేడాది కన్నా ఇది 6.6 శాతం ఎక్కువ. ఈ కాలానికి రైతులు చేసిన ఆహారపదార్థాల ఉత్పాదన 29.66 కోట్ల టన్నులు. ఇది గతేడాది కన్నా 5.81 కోట్ల టన్నుల అధికం. దేశంలో పశు వనరుల సంఖ్య 53.57 కోట్లు. ఇది ప్రపంచంలోని పశు సంపదలో 31 శాతం. దేశంలో ఏటా పాలు, పాల ఉత్పత్తులు 10 శాతం పెరుగుతున్నవి. ఇదంతా దేశానికి రైతన్నలు చేస్తున్న సేవ. వీరి ఉత్పాదకత వల్లనే ఆహారోత్పత్తుల ఎగుమతిదారుల్లో మన దేశం మొదటి 15 దేశాల సరసన నిలిచింది. డాలర్లలో చెప్పాలంటే రైతన్నలు దేశానికి 535 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పాదనలను అందిస్తున్నారు. ఇంతకు రెట్టింపు అంటే ఒక ట్రిలియన్ డాలర్ల పరిశ్రమగా వ్యవసాయాన్ని మార్చాలని దేశ ప్రభుత్వం కోరుకుంటున్నది.
దేశానికి ఇంత సేవ చేస్తున్న రైతన్నకు ఈ దేశంలో తగిన గుర్తింపు లభిస్తున్నదా అని మనం ప్రశ్నించుకుంటే సిగ్గుపడే పరిస్థితులే ఉన్నాయి. దేశంలో ఏ నాయకుడూ రైతన్నను చేరదీయలేదు. వ్యవసాయాభివృద్ధి అని ప్రకటించి ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలన్నీ వ్యవసాయాధారిత పరిశ్రమలు అంటే.. ఎరువులు, పురుగుమందులు, కీటకనాశిను లు వంటి రసాయనాలను ఉత్పత్తి చేసే కంపెనీలే లాభాలు గడిస్తున్నాయి తప్ప, రైతన్నకు సాయం చేసేవేవీ లేవు. ఈ రసాయనిక ఉత్పాదనలు చేసే కంపెనీల యజమానులు కేంద్రమంత్రుల సరసన కనిపిస్తున్నారే తప్ప, ఒక్క రైతన్ననూ ఏ నాయకుడు తన పక్కన కూర్చోపెట్టుకున్న దాఖలా దాదాపు మృగ్యమనే చెప్పాలి.
గతంలో జన్మభూమి, రచ్చబండ వంటి కార్యక్రమాలు జరిగేవి. అధికారుల సమక్షంలో మంత్రులు, ముఖ్యమంత్రులు ఆ కార్యక్రమాలు నిర్వహించినా, అవి రైతుల ముందు అధికారులను అదిలించడం లాటి పనులకే పరిమితమైనాయి. ప్రభుత్వాధినేత స్వయంగా రైతుల పక్కన కూర్చొని గ్రామాభివృద్ధికి చర్చలు చేసింది ఎప్పుడూ కనిపించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి డ్రామాలెన్నో నడిచాయి. పత్రికల్లో వార్త ప్రచురితం కాగానే, అధికారులు, మంత్రులు ఆ సమావేశాల్లో చేసిన హామీలను మరిచిపోయేవారని మనకు తెలుసు. నాటి మొక్కుబడి కార్యక్రమాల వలె కాకుండా నేరుగా రైతులు, అధికారులు, ముఖ్యమంత్రి ఒకే సభలో పరస్పర అభిప్రాయాల ఆదానప్రదానాలతో కార్యక్రమం జరిగితే, ఆ గ్రామ ప్రజలకు ప్రభుత్వం పట్ల కలిగే నమ్మకం అమూల్యమైనది. అలాంటి ఒక అపూర్వమైన కార్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిచూపించారు. ఎప్పుడో గాంధీ పక్కనో, వినోబా భావే పక్కనో, అన్నా హజారే పక్కనో రైతన్న కూర్చున్న చిత్రాలే లభిస్తాయి తప్ప, పాలకులైన నాయకుల పక్కన కూర్చున్న చిత్రాలు కనిపించవు. అలాంటి అపూర్వ చిత్రాన్ని సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామసభలో సాక్షాత్కరింపజేశారు. గ్రామీణ ప్రజానీకంలో మరీ ముఖ్యంగా రైతాంగంలో ఈ ప్రభుత్వం మనదే, మన కోసం పనిచేసేదే అన్న నమ్మకాన్ని కలిగించారు.
తాను దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామసభలో కేసీఆర్ గ్రామాధికారులను వెంట కూర్చోబెట్టుకొని, సహపంక్తి భోజనాలు చేసి పల్లె బాగుకోసం చర్చ చేశారు. రైతే పాలకునిగా, పాలకుడే రైతుగా కనిపించిన సభ ఇది. ఇది దేశ చరిత్రలోనే తొలి ఘటన అని చెప్పవచ్చు. ‘గ్రామాభివృద్ధిలో మహిళలది కనిపించని మేరు పర్వతమంత పాత్ర. మహిళల ప్రమేయం, సహకారం లేకపోతే ఎంతటి గ్రామీణాభివృద్ధి ప్రణాళికైనా సఫలం కాదు. అందుకే గ్రామీణ మహిళలను గ్రామాభివృద్ధిలో సక్రియంగా పాల్గొనమని, వ్యక్తులో, పరిస్థితులో దారి తప్పుతున్నప్పుడు మందలించాల్సిన అధికారం స్త్రీలదే’ అనే సీఎం కేసీఆర్ అన్నారు. ఇది.. గ్రామీణాభివృద్ధిలో మహిళల పాత్రను శ్లాఘించిన గాంధీ తదితరుల గ్రామస్వరాజ్య స్వప్నాన్ని సాకారం చేసే దిశలో ఉన్నది.
పల్లె రాజకీయాలు, పట్టణ రాజకీయాలకు మధ్య చాలా తేడా ఉన్నది. కుల, మత, పార్టీ భావాలు పల్లెల్లో ఉన్నంత తీవ్రంగా పట్టణ ప్రజానీకంలో ఉండవు. సాధారణంగా ఈ కుల, మత, వర్గ, పార్టీ రాజకీయాలే గ్రామీణాభివృద్ధికి ఆటంకంగా మారుతుంటాయి. వాటన్నింటిని గ్రామీణాభివృద్ధి కోసం మనసులోంచి తుడిచిపెట్టి, భుజం భుజం కలిపి నడవాలన్న సీఎం కేసీఆర్ సందేశం ప్రజలందరిలో ఒక ఐక్యతా భావాన్ని నిలపటానికి జరిగిన కృషిగా నిలిచిపోతుంది. శాంతి, సౌహార్దాలకే గ్రామంలో స్థానం ఉండాలి తప్ప గ్రామీణాభివృద్ధిలో ఎలాంటి భేద భావాలు ఉండకూడదన్నది సీఎం కేసీఆర్ మాట. ఇంతకాలం గ్రామీణాభివృద్ధి కుంటుపడటానికి వెనుక ఉన్న ముఖ్య కారణం దీంతో ప్రజలకు అవగతమైంది.
అన్నీ ప్రభుత్వమే చేయాలనుకోవడం, దానికోసం ఎదురుచూపులు చూడటం ఎలాంటి అభివృద్ధికి దోహదం చేయవు. ఈ పల్లె నాది, దీని అభివృద్ధితోనే నా అభివృద్ధి ముడిపడి ఉందని అందరూ గ్రహించాలి. ఆ ఎరుక కలిగితే గ్రామీణాభివృద్ధి సులభసాధ్యం. అందుకుగాను గ్రామస్థులు గ్రామ నిధిని, గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటుచేసుకోవాలి. ఆ గ్రామ నిధికి ప్రభుత్వమూ సహకరించాలి. అలా ప్రతి గ్రామం గ్రామనిధిని ఏర్పాటుచేసుకోవాలి. దానికి అధికారులు, ప్రభుత్వం, పల్లె ప్రజలు కలిసిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇలా గ్రామనిధి ఏర్పాటు జరిగితే గ్రామాభివృద్ధి కమిటీ నేతృత్వంలో ఆ గ్రామంలో వ్యవసాయమే కాదు, గ్రామీ ణ ఆర్థికవ్యవస్థలో భాగమైన ఇతర వృత్తులూ మళ్లీ వెలుగులు చూస్తాయి. ఎలాంటి వివక్ష లేకుండా గ్రామీణ స్వయం ఉపాధులకూ ఊతం దొరుకుతుం ది. ఇది గ్రామీణ స్వయం సమృద్ధికి బాటలు వేస్తుం ది. ఆదర్శ గ్రామ నిర్మాణానికి బలమైన పునాదులు పడతాయి. ప్రతి పల్లెలో ఈ బాటపడితే సమగ్రాభివృద్ధి సత్వర సాధ్యం. ఈ ఊహ ను ఒక్క ద్రష్ట, స్రష్ట అయిన నాయకుడు మాత్రమే చేయగలుగుతాడు. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇత ర నాయకులకూ మధ్య ఉన్న భేదం. ఇలా గ్రామాభివృద్ధి కోసం ఒక ఆదర్శవంతమైన నమూనాను సిద్ధం చేసేందుకు అందరూ కలిసిరావాలని కోరిన ముఖ్యమంత్రి అవసరమనుకుంటే ఇరువై సార్లయినా వాసాలమర్రికి వస్తానని ప్రకటించడం గ్రామీణాభివృద్ధి పట్ల ఆయనలో ఉన్న దృఢ సంకల్పానికి ప్రతీక.
ఒక్క చుక్కతో ఆరంభమైన నదీ ప్రవాహం సముద్ర సంగమంతో విశాలమవుతుంది. ఒక గ్రామం ప్రగతి పథంలో నడవడం ఆరంభిస్తే, మరిన్ని గ్రామాలు ఆ బాట పడతాయి. గ్రామాలు స్వయం సమృద్ధి బాటలో, వికాసం దిశగా అడుగులు వేస్తే తెలంగాణ సస్యశ్యామలంగా నిలవడమే కాదు, మరుగున పడిపోతున్న ఎన్నో చేతివృత్తులు మళ్లీ పునరుజ్జీవనం పొందుతాయి. గ్రామీణ స్వయం సమృద్ధి అనే మహాత్ముని స్వప్నం సాకారమవుతుంది. ఆ దిశలో పూర్తి గా అంకితమై అడుగులు వేస్తున్న తొలి నేత మన తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్.
-డాక్టర్ కె.పూర్ణ ప్రజ్ఞాభారతి