న్యూఢిల్లీ, మే 17: కరోనా వైరస్ దెబ్బకు అల్లాడిపోతున్న జనజీవనంపై.. ధరల రక్కసి దాడి చేస్తున్నది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెల మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైమ్ హై రికార్డులో నమోదైంది. ఇది రెండెంకల స్థాయిని తాకుతూ ఏప్రిల్లో 10.49 శాతంగా ఉందని సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. ఆహారోత్పత్తులు, ముడి చమురు, తయారీ వస్తువుల ధరలు పెరుగడంతో టోకు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో మున్ముందు నెలల్లో ద్రవ్యోల్బణం మరింతగా విజృంభించే వీలుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఈ నెలకుగాను 13-13.5 శాతంగా ఉండొచ్చని ఐసీఆర్ఏ ప్రధాన ఆర్థికవేత్త అదితీ నాయర్ అంటున్నారు. రాబోయే మూడు నెలలు డబ్ల్యూపీఐ గణాంకాలు దాదాపు 10.5 శాతం దరిదాపుల్లోనే ఉంటాయని పేర్కొంటున్నారు. టోకు ధరల సూచీ పెరగడం.. వరుసగా ఇది నాలుగో నెల. ఈ ఏడాది మార్చిలో ఇది 7.39 శాతంగా ఉన్న విషయం తెలిసిందే.
పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదలే ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రాష్ర్టాల్లో వంద రూపాయలకు చేరువ కావడం, కొన్నిచోట్ల సెంచరీ కొట్టడంతో ఆ భారం రవాణాపై పడుతున్నది. దీంతో అన్ని వస్తూత్పత్తుల సరఫరా ఖర్చులు పెరిగిపోతుండగా, ఆయా ఉత్పత్తిదారులు, సంస్థలు వీటిని వినియోగదారులపైనే మోపుతున్నారు. ‘ఈ ఏప్రిల్లో ద్రవ్యోల్బణం వార్షిక రేటు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం పెరుగుతున్న ముడి చమురు ధరలు, పెట్రోల్-డీజిల్ రేట్లే’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ప్రకటించడం గమనార్హం.
ఆహార ద్రవ్యోల్బణం గత నెల 4.92 శాతంగా ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఆరు నెలల గరిష్ఠం. ముఖ్యంగా గుడ్లు, మాంసం, చేపల ధరలు పెరిగాయి. ఇక పప్పుధాన్యాలు, పండ్ల ధరలూ చుక్కలు చూపిస్తున్నాయి. ఆహార ద్రవ్యోల్బణంలో వీటి వాటా 10.74 శాతం, 27.43 శాతంగా ఉన్నాయి. అయితే కూరగాయల ధరల సూచీ మైనస్ 9.03 శాతంగా చూపిస్తున్నట్లు తేలింది. మరోవైపు ఇంధనం, విద్యుత్తు ద్రవ్యోల్బణం 20.94 శాతంగా ఉండగా, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 9.01 శాతంగా ఉన్నది.