న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వరుసగా ఆరో నెలలో భారీ పెట్టుబడుల్ని ఆకర్షించాయి. ఆగస్టు నెలలో ఈక్విటీ ఫండ్స్లోకి రూ.8,666 కోట్ల పెట్టుబడులు తరలివచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (అంఫి) బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయ్యింది. న్యూ ఫండ్ ఆఫర్స్ (ఎన్ఎఫ్వోలు)లోకి భారీ నిధులురావడం, సిప్ల్లోకి నిధుల ప్రవాహం స్థిరంగా కొనసాగడంతో ఈక్విటీ ఫండ్స్లోకి అధికస్థాయిలో నికర పెట్టుబడులు వచ్చాయి. ఆగస్టు చివరినాటికి మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తులు ఆల్టైమ్ రికార్డుస్థాయి రూ.36.6 లక్షల కోట్లకు చేరాయి. అయితే జూలై నెలలో వచ్చిన రూ.22,583 కోట్లకంటే ఆగస్టులో పెట్టుబడులు తక్కువే. జూన్ నెలలో రూ.5,988 కోట్లు, మే లో రూ.10,083 కోట్లు, ఏప్రిల్లో రూ. 3,437 కోట్లు, మార్చిలో రూ.9,115 కోట్ల నిధుల్ని ఈక్విటీ ఫండ్స్ ఆకర్షించాయి. అంతకుముందు కొవిడ్ తొలివేవ్ నేపథ్యంలో 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకూ 8 నెలలపాటు ఫండ్స్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.
4.32 కోట్లకు సిప్ ఖాతాలు..
ఆగస్టు నెలలో సిప్ ఖాతాల సంఖ్య 4.17 కోట్ల నుంచి 4.32 కోట్లకు పెరిగింది. వీటిలోకి రికార్డుస్థాయిలో రూ.9,923 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఫండ్స్లో విభాగాలవారీగా చూస్తే ఈ ఆగస్టు నెలలో ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి రూ.4,741 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్లోకి రూ.3,073 కోట్లు, సెక్టరోల్ ఫండ్స్లోకి రూ.1,885 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ మల్టీక్యాప్, లార్జ్క్యాప్, స్మాల్క్యాప్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) నుంచి పెట్టుబడులు తరలివెళ్లాయి. స్టాక్ మార్కెట్ అత్యంత గరిష్ఠస్థాయికి చేరడంతో పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.36 లక్షలు దాటిందని అంఫి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ఎస్ వెంకటేష్ చెప్పారు. ఫండ్స్లో పెట్టుబడులకు సరైన తరుణంకోసం వేచిచూస్తున్న పలువురు ఇన్వెస్టర్లు నెమ్మదిగా పెట్టుబడుల్ని పెడుతున్నారని, రికార్డు ఎన్ఎఫ్వో వసూళ్ల ద్వారా ఈ ట్రెండ్ స్పష్టమవుతున్నదని ఫండ్స్ ఇండియా రీసెర్చ్ హెడ్ అరుణ్ కుమార్ తెలిపారు. కరోనా సెకండ్వేవ్ తీవ్రత తగ్గడం, వ్యాక్సినేషన్లు పెరగడం, ఈక్విటీల భారీ ర్యాలీ వంటి అంశాలతో ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగిందని ఆయన వివరించారు.