న్యూఢిల్లీ: ఇండియాలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్రుష్టి సారించింది. భారత్లో సంస్థ లావాదేవీల పూర్తి సమాచారాన్ని అందజేయాలని అమెజాన్ ఇండియాను కోరినట్లు ఈడీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. అమెజాన్ ఇండియా ఏండ్ల తరబడి విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించిందా? అన్న కోణంలోనే ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈడీ వర్గాలు సదరు గడువు వివరాలను వెల్లడించలేదు. తదుపరి అమెజాన్ ఇండియా ప్రతినిధిని విచారణకు హాజరు కావాలని పిలుస్తారా? అన్న సంగతిపై ఈడీ వర్గాలు నోరు మెదపడం లేదు. దీనిపై అమెజాన్ ఇండియా ప్రతినిధి కూడా స్పందించడానికి నిరాకరించారు.
2012-19 మధ్య అమెజాన్ అంతర్గత వ్యాపార లావాదేవీల నివేదికల ఆధారంగా.. భారత్లో ఈ ఈ-కామర్స్ దిగ్గజం లావాదేవీలపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఇటీవల ఓ వార్తా కథనం ప్రచురించింది. దేశంలోని చిన్న వ్యాపారుల ఉత్పత్తులను ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కింద అమెజాన్ వేదిక నుంచి అమ్ముకునేందుకు కేంద్రం అనుమతించింది. స్మాల్ ట్రేడర్ల ఉత్పత్తుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, వివక్షా రహితంగా ఉండాలని కేంద్రం తెలిపింది. చిన్న వ్యాపారులను రక్షించేందుకు ఎప్పటికప్పుడు అమెజాన్ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూనే వచ్చింది.
భారత చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహిస్తామని అమెజాన్ ఇండియా తెలిపింది. కానీ అమెజాన్, వాల్మార్ట్ సారథ్యంలోని ఫ్లిప్కార్ట్ వ్యాపారాల వల్ల తమ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయని భారతీయ రిటైలర్లు ఆరోపిస్తున్నారు. ఆపిల్ వంటి అతిపెద్ద సంస్థల ఉత్పత్తుల విక్రయం విషయమై ఆ సంస్థకు మాత్రమే అమెజాన్ డిస్కౌంట్ ఫీజు చెల్లిస్తున్నదని చెబుతున్నారు.