లక్నో, జూన్ 11: కొవిడ్ సోకిన వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలతో (ప్రతిరక్షకాలు) పోలిస్తే, వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటిబాడీలు శక్తిమంతమైనవని ఉత్తరప్రదేశ్లోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) అధ్యయనంలో తేలింది. అలాగే, వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ప్రతిరక్షకాలు ఎక్కువ కాలం ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 989 కేజీఎంయూ హెల్త్కేర్ వర్కర్లు, 500 మంది ప్లాస్మా దాతలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్టు చెప్పారు. వైరస్ గొలుసును విచ్చిన్నం చేయడానికి సాయపడే హెర్డ్ ఇమ్యూనిటీ (సమూహ రోగనిరోధక శక్తి) సాధించాలంటే పెద్దఎత్తున వ్యాక్సినేషనే పరిష్కారమని పేర్కొన్నారు.
టీకాతో ఆక్సిజన్ థెరపీ అవసరం లేదు!
చెన్నై: కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారు దవాఖానలో చేరే అవకాశాలు తగ్గుతాయని, ఆక్సిజన్ థెరపీ, ఐసీయూ చికిత్స అవసరం దాదాపుగా ఉం డబోదని వెల్లూర్లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ) అధ్యయనం వెల్లడించింది. జనవరి 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యన 10,600 మందిపై అధ్య యనం చేసింది. వైద్యసిబ్బందికి వ్యాక్సినేషన్ ఎంతో అవసరమని అభిప్రాయపడింది.
డెల్టాతో ప్రమాదమే!
లండన్: సెకండ్వేవ్కు కారణంగా భావిస్తున్న డెల్టా వేరియంట్.. బ్రిటన్లో తొలిసారిగా వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్తో పోలిస్తే 60 శాతం ఎక్కువ తీవ్రతతో వ్యాప్తి చెందుతున్నదని ఆ దేశానికి చెందిన పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) నిపుణుల బృందం. దీంతోపాటు వ్యాక్సిన్ల సమర్థతపై కూడా ఇది ప్రభావం చూపిస్తున్నదని వైద్యులు పేర్కొన్నారు. బ్రిటన్లో కొత్త కేసుల్లో 90% డెల్టావేనని వెల్లడించారు.
పేద దేశాలకు 100 కోట్ల డోసులు
లండన్: కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు ఆపన్న హస్తం అందించే దిశగా జీ-7 శిఖరాగ్ర సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాదినాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల డోసుల్ని పేద, మధ్యతరగతి దేశా లకు పంపిణీ చేయాలని సభ్యదే శాలు నిర్ణయించాయి.
ఐఎన్ఐ సెట్ నెల వాయిదా
న్యూఢిల్లీ: మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఎన్ఐ సెట్-2021ను ఈ నెల 16న నిర్వహించాలని ఎయిమ్స్ నిర్ణయించడం ‘ఏకపక్షం, వివక్షాపూరితం’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 16 నుంచి కనీసం నెల తర్వాత పరీక్ష నిర్వహించాలని ఎయిమ్స్ను ఆదేశించింది. జేఈఈ, ఇతర బోర్డు పరీక్షలు వాయిదా పడిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.
కొవిషీల్డ్ గ్యాప్పై ఆందోళన వద్దు: కేంద్రం
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య ఎడం తగ్గిస్తే, ఇమ్యూనిటీ పెరుగుతుందన్న అధ్యయనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికిప్పుడు ఆ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని తగ్గించాల్సిన అవసరంలేదని నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్ పేర్కొన్నారు.
కొవాగ్జిన్ ఎమర్జెన్సీ వాడకానికి ఎఫ్డీఏ అనుమతి నిరాకరణ
హైదరాబాద్, జూన్ 11: అమెరికాలో కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) అనుమతి నిరాకరించింది. మరిన్ని ట్రయల్స్ నిర్వహించి అదనపు సమాచారంతో బయాలాజికల్ లైసెన్స్ అప్లికేషన్(బీఎల్ఏ) కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీని కింద దరఖాస్తు చేస్తే టీకాకు పూర్తి స్థాయి అనుమతులు లభిస్తాయి. దీంతో పూర్తిస్థాయి అనుమతుల కోసం మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు భారత్ బయోటెక్ శుక్రవారం వెల్లడించింది. అమెరికాలో తగినంత మంది ప్రజలకు టీకాలు వేయడంతో కొత్తగా ఏ టీకాకూ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వవద్దని ఎఫ్డీఏ నిర్ణయించింది.