Electric Vehicles | హైదరాబాద్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఎలక్ట్రిక్ వెహికిల్స్ లేదా ఈవీ)కు డిమాండ్ పెరుగుతున్నది. ఇంధన ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో వాహనదారులు, ముఖ్యంగా యువత ఈవీ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. లీటర్ పెట్రోల్ రూ.100కుపైగానే పలుకుతుండగా, డీజిల్ రూ.100కు సమీపంలో ఉన్నది. దీంతో ఎలక్ట్రిక్ వెహికిల్సే ఉత్తమం అన్న భావన పెరిగిపోతున్నది. నయా మోడళ్లూ ఆకట్టుకునేలా వస్తున్నాయి.
కేవలం ఎలక్ట్రిక్ కార్లు, మోటర్ బైక్లకే హైదరాబాద్ మార్కెట్లో ఆదరణ పరిమితం కావడం లేదు. ఈ-రిక్షాలకూ డిమాండ్ ఉన్నది. ఈవీలకు సంబంధించి ప్రకటనలు, ప్రమోషన్లూ నగరంలో ఇప్పుడు బాగానే పెరిగాయి. దీంతో భారత్లో తమ ఈవీలను పరిచయం చేయాలనుకుంటున్న పలు అంతర్జాతీయ సంస్థలూ.. హైదరాబాద్ను వేదికగా చేసుకునే యోచనలో ఉన్నాయి.
రోజురోజుకూ మితిమీరిపోతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నది. ఇది కూడా హైదరాబాద్లో ఈవీలకు డిమాండ్ను తెచ్చిపెట్టిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ కింద ఉచిత రిజిస్ట్రేషన్, రహదారి పన్ను మినహాయింపు సైతం కల్పిస్తున్నారు.
బ్యాటరీలతో నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) రెన్యువల్ లేదా ఇష్యూ ఫీజుల చెల్లింపు మినహాయింపు ఇస్తున్నట్లు మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. కొత్త రిజిస్ట్రేషన్ మార్కుల అసైన్మెంట్ కోసం చెల్లించే ఫీజుల నుంచీ మినహాయింపు ఉంటుందని పేర్కొన్నది. ఈవీలను కొనుగోలు చేసేవారికి ఫేమ్-2 పథకం కింద రాయితీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న విషయం తెలిసిందే.
నెల రోజుల్లో 5వేలు కేవలం నెల రోజుల్లోనే హైదరాబాద్ పరిధిలో 5వేలకుపైగా ఈవీలు అమ్ముడయ్యాయని ఓ ఆర్టీఏ అధికారి తెలిపారు. విక్రయాల్లో స్థిరమైన వృద్ధి కనిపిస్తున్నదని పరిశ్రమ వర్గాలూ చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కొన్ని చోట్లనే చార్జింగ్ స్టేషన్లున్నాయని, అమ్మకాలు పెరిగేకొద్దీ చార్జింగ్ స్టేషన్లూ పెరగాల్సిన అవసరం ఉన్నదని ఇండస్ట్రీ అభిప్రాయపడుతున్నది.
కేవలం నెల రోజుల్లోనే హైదరాబాద్ పరిధిలో 5వేలకుపైగా ఈవీలు అమ్ముడయ్యాయని ఓ ఆర్టీఏ అధికారి తెలిపారు. విక్రయాల్లో స్థిరమైన వృద్ధి కనిపిస్తున్నదని పరిశ్రమ వర్గాలూ చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కొన్ని చోట్లనే చార్జింగ్ స్టేషన్లున్నాయని, అమ్మకాలు పెరిగేకొద్దీ చార్జింగ్ స్టేషన్లూ పెరగాల్సిన అవసరం ఉన్నదని ఇండస్ట్రీ అభిప్రాయపడుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు.. ఓసారి లుక్కేయండి!
పంద్రాగస్టుకు మార్కెట్లోకి ఓలా స్కూటర్
Ola Scooter | పది రంగుల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400 సిటీల్లో చార్జింగ్ ఫెసిలిటీ..!