న్యూఢిల్లీ: విద్యుత్ టూ వీలర్స్పై ఇచ్చే రాయితీని 50 శాతానికి పెంచినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు ప్రశంసల్లో ముంచెత్తాయి. ప్రభుత్వ నిర్ణయం గొప్పదని అభివర్ణించాయి. ఇది పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాలవైపు మారేందుకు దోహదపడుతుందన్నాయి. విద్యుత్ వాహన రంగంలో నవ శకానికి దిశా నిర్దేశం అవుతుందన్నాయి.
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2)లో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఇప్పటివరకు ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్తో సహా అన్ని విద్యుత్ వాహనాలకు కిలోవాట్కు రూ.10వేల రాయితీ ఇస్తున్నది. ఇక దాన్ని కిలోవాట్కు రూ.15 వేలకు పెంచనున్నది.
ఫేమ్ స్కీమ్ కింద విద్యుత్ ద్విచక్రవాహనాల మొత్తం ధరలో ప్రస్తుతం 20 శాతం రాయితీ పరిమితి ఉంది. సవరించిన నిబంధన ప్రకారం దాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ 40 శాతానికి పెంచేసింది.
కేంద్ర నిర్ణయంపై ఎథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా స్పందిస్తూ ‘ఫేమ్-2 విధానంలో మార్పులు గొప్ప నిర్ణయం. కొవిడ్ సంక్షోభం ఉన్నా. విద్యుత్ ద్విచక్రవాహన అమ్మకాలు పెరిగాయి’ అని చెప్పారు.
‘తాజా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వచ్చే నాలుగేండ్లలో విద్యుత్ టూ వీలర్స్ 60 లక్షల యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉంది. స్థానికంగా విద్యుత్ ద్విచక్రవాహనాల తయారీపై దృష్టి పెట్టడం ద్వారా భారత్ విద్యుత్ వాహన హబ్గా ఎదుగుతుంది’ అని తరుణ్ మెహతా అన్నారు.
‘ప్రభుత్వ నిర్ణయంతో సాధారణ వాహనాలకు దగ్గరగా విద్యుత్ ద్విచక్రవాహన ధరలు తగ్గుతాయని, ద్విచక్రవాహనాలకు అడ్డంకిగా మారిన అధిక ధరల ముద్ర తొలుగుతుంది‘ అని విద్యుత్ వాహన తయారీదార్ల సంఘం (ఎస్ఎంఈవీ) డీజీ సొహిందర్ గిల్ వెల్లడించారు.
ఒకసారి ఛార్జింగ్తో 100 కి.మీ వెళ్లే సిటీ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.60,000 దిగువకు వస్తుంది. 80 కి.మీ ప్రయాణించే హైస్పీడ్ స్కూటర్ ధర రూ.లక్షకు చేరుతుంది.
హీరో ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజాల్ స్పందిస్తూ..ఫేమ్-2 సబ్సిడీ పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశంలో విద్యుత్ వాహనాల రంగంలో నూతన శకం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
దేశీయంగా పెట్రోల్ ధరలు రూ.100 మార్కుకు చేరడంతో వినియోగదారులు విద్యుత్ వాహనాల వైపు అడుగులు వేయడానికి సబ్సిడీల పెంపు పనిచేస్తుందని నవీన్ ముంజాల్ అన్నారు. ప్రస్తుతం విద్యుత్ వాహనాల కోసం ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు, విద్యుత్ వాహన వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.