న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు భగభగ మండుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్ల నేపథ్యంలో 2020-23 మధ్య విద్యుత్ వాహనాల కొనుగోళ్లలో పురోగతి నమోదు కానున్నది. ఈ మూడేండ్లలో ఏటా 26 శాతం విద్యుత్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతాయని తెలుస్తున్నది.
కోవిడ్-19 మహమ్మారితో ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం, దేశీయంగా పరిమితంగా వాహనాల ఉత్పత్తి వంటి అంశాలు విద్యుత్ వాహనాల విస్తరణకు సవాళ్లుగా పరిణమిస్తాయని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది.
భారీగా పెట్రోల్/ డీజిల్లపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం విధించింది. మరోవైపు, విద్యుత్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకున్నది.
విద్యుత్ వాహనాల విక్రయంపై జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గించింది. మరోవైపు, విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఆదాయం పన్ను మినహాయింపునిచ్చింది.
2030 నాటికి ఆసియా రీజియన్లో 10.9 మిలియన్ల యూనిట్ల విద్యుత్ వాహనాలు అమ్ముడు అవుతాయని ఫిచ్ అంచనా వేసింది. గతేడాది 14 లక్షల విద్యుత్ వాహనాలు అమ్ముడవుతాయని పేర్కొంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో 2029 వరకు విద్యుత్ వాహనాలకు డిమాండ్ ఎక్కువ అవుతుందన్నది.