ముంబై: కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రజానీకం ఇండ్లలోనే ఎక్కువ టైం కేటాయించాల్సి రావడంతో వారి జీవన శైలిలో మార్పు వచ్చిందని హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. పెద్ద ఇండ్ల కోసం ప్రజల్లో డిమాండ్ పెరిగిందని మంగళవారం సంస్థ 44వ వార్షిక సమావేశంలో అన్నారు. చౌక ఇండ్ల నుంచి విలాసవంతమైన ఆస్తుల కొనుగోళ్లకు 2020-21లో డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపారు.
ఈ-కామర్స్ రంగం అభివ్రుద్ధి చెందుతుండటంతో గోదాములు, ఫుల్ఫిల్మెంట్ సెంటర్లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లకు గిరాకీ ఎక్కువైందని దీపక్ పరేఖ్ తెలిపారు. అత్యధిక కంపెనీలు తమ ఆఫీసులను వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో కమర్షియల్ రియల్ ఎస్టేట్కు ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు.
దేశీయ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాని, తత్ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ మొదలైందని ఆయన అన్నారు. ఇక ముందు వైరస్ వేవ్స్ ముప్పు పొంచి ఉన్నప్పటికీ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయికి పెరిగాయని చెప్పారు.