గిఫ్ట్ ప్యాక్లు పంపిణీకి శ్రీకారం
కరోనా కష్టకాలంలో పేద ముస్లింలకు అండగా..
జిల్లాలో 8500 మందికి లబ్ధి
పర్యవేక్షణ అధికారులుగా తాసిల్దార్లు
వికారాబాద్లో గిఫ్ట్ ప్యాక్లు అందజేసిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్, మే 1, (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో పేద ముస్లింలకు ప్రభుత్వం రంజాన్లో గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ ప్రారంభించింది. రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి 8500 గిఫ్ట్ ప్యాక్లు జిల్లాకు చేరాయి. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ నిబంధనల ప్రకారం పంపిణీకి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
జిల్లాకు చేరిన గిఫ్ట్ ప్యాక్లు
పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం ప్రతి యేటా గిఫ్ట్ ప్యాక్లు అందజేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాకు 8500 గిఫ్ట్ ప్యాక్లు వచ్చాయి. వీటిని నియోజకవర్గాల వారీగా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్కు 2500, కొడంగల్కు 1500, తాండూరుకు 2500, పరిగికి 2000ల చొప్పున కేటాయించారు. మసీదుల వారీగా అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి అందజేయనున్నారు. పంపిణీకి ఇబ్బందులు ఏర్పడకుండా ఇప్పటికే నియోజకవర్గాల కేంద్రాల్లోని తాసిల్దార్లను ఆయా మండలాల ఇన్చార్జిలుగా నియమించారు. వీరు స్థానిక ప్రజాప్రతినిధుల సహాయంతో అర్హులైన వారికి పంపిణీ చేస్తారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముస్లింలకు పండుగ కానుకలను పంపిణీ చేశారు.
పంపిణీకి కమిటీ
వికారాబాద్, తాండూరు నియోజకవర్గాలకు ఆర్డీవోలు, పరిగి నియోజకవర్గానికి బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, కొడంగల్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూమోజెస్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ప్యాక్ల పంపిణీకి నియమించారు. జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. పంపిణీ కోసం మసీదు కమిటీలకే అప్పగించారు. ప్రత్యేకాధికారులుగా తాసిల్దార్లు వ్యవహరిస్తారు. ఒక్కో కిట్లో 5 మీటర్ల వైట్ క్లాత్, చీర, యువతుల కోసం డ్రెస్ మెటీరియల్ను అందజేస్తున్నారు. ప్రతి యేటా ప్రభుత్వం తరఫున నిర్వహించే ఇఫ్తార్ విందును కొవిడ్ వ్యాప్తి కారణంగా నిర్వహించడం లేదని అధికారులు వెల్లడించారు.
నిబంధనలు పాటిస్తూ పంపిణీ
రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాకు 8500 గిఫ్ట్ ప్యాక్లు వచ్చాయి. త్వరలోనే జిల్లాలోని ఎమ్మెల్యేల సమయాన్ని బట్టి పంపిణీ చేస్తారు. వీటిని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తాసిల్దార్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అర్హులైన వారికి పంపిణీ చేయనున్నారు.