అహ్మదాబాద్,జూలై :దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నిప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు ఫాస్టర్ ఎడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఫేమ్)పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఫేమ్ పథకం-1కింద ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీ సంస్థలకు పలురకాల ప్రోత్సాహకాలను అందించింది.
ఫేమ్ పథకం-2 కింద ఆయా కంపెనీలకు మరింతగా సబ్సిడీ అందిస్తున్నది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్లో ప్రోత్సాహకాలను కిలోవాట్కు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది. ఈ ప్రోత్సాహకాలు 50 శాతం పెరగడంతో, తయారీదారులు కూడా తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గిస్తున్నాయి. దీంతో ఈవీ కంపెనీలు తమ కష్టమర్లకు భారీ తగ్గింపుతో వాహనాలను అందిస్తున్నాయి.
మరిన్ని రాయితీలు..
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలకు అదనంగా,గుజరాత్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి మరిన్ని రాయితీలను ప్రవేశపెట్టింది. దీంతో గుజరాత్లో ఎలక్ట్రిక్ వాహనాలు మరింత చౌకగా మారాయి. ఈ నేపథ్యంలో ఆంపియర్ అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు సుమారు రూ.50వేల వరకూ తగ్గాయి.
ఎలక్ట్రిక్ వాహనాలపై కేందం అందిస్తున్నసబ్సిడీతోపాటు గుజరాత్ రాష్ట్రం అందిస్తున్న అదనపు సబ్సిడీల కారణంగా ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు భారీగా తగ్గాయి.ఆంపియర్ వెహికల్స్, గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ ఈ-మొబిలిటీ విభాగం. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ సవరణ కారణంగా ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.50 వేలవరకు తగ్గాయి. గుజరాత్ రాష్ట్రం అనుసరిస్తున్న ఈవీ విధానం ఆంపియర్ వాహనాల ఖర్చును మరింత తగ్గించటానికి సహాయపడుతున్నది.
గుజరాత్లో ధరల సవరణకు ముందు రూ.74,990 ధరతో విక్రయిస్తున్న ఆంపియర్ మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కేవలం రూ.47,990 లకే లభిస్తున్నది. అంటే, ఈ స్కూటర్ ధరలో మొత్తం రూ.27వేల తగ్గుతున్నది. ఇదే రాష్ట్రంలో లభిస్తున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ జీల్ స్కూటర్ ధర ఇంతకుముందు 68,990 రూపాయలుగా ఉండగా, ఇప్పుడు కేవలం 41,990 రూపాయలకే లభిస్తోంది. దీని ధరను కూడా గరిష్టంగా రూ.27వేలకు తగ్గించారు.