న్యూఢిల్లీ: కొత్తగా ఆదాయం పన్నుశాఖ (ఐటీ) ప్రారంభించిన ఈ -ఫైలింగ్ పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. పోర్టల్ ప్రారంభమై వారమైనా ఇంకా సాంకేతిక సమస్యలు వీడలేదని పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పోర్టల్లోకి లాగిన్ కావడానికి సాధారణం కంటే ఎక్కువ టైం పడుతున్నదని పలువురు చార్టెడ్ అకౌంటెంట్లు చెబుతున్నారు.
పన్ను రిటర్న్ల దాఖలు ప్రక్రియను సులభతరం చేస్తున్నామంటూ ఈ నెల ఎనిమిదో తేదీన ఐటీ శాఖ కొత్త పోర్టల్ http://www.incometax.gov.in ను అందుబాటులోకి తెచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తొలిరోజే దీనిపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనికి సూచించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఇన్ఫోసిస్ క్రుషి చేస్తున్నదని నిలేకని బదులిచ్చారు.
ఇదంతా జరిగి వారం గడుస్తున్నా ఇంకా పోర్టల్లో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయని, పలు ఫీచర్లు పనిచేయడం లేదని పలువురు చార్టెట్ అకౌంటెంట్లు అంటున్నారు. లాగిన్కే సాధారణం కంటే ఎక్కువగా దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పడుతున్నదని సీఏలు పేర్కొంటున్నారు.
‘ఈ- ప్రొసీడింగ్స్’ విభాగంలోకి వెళితే ‘కమింగ్ సూన్’ అనే సందేశం కనిపిస్తున్నదన్న విమర్శ వినిపిస్తున్నది. కొత్త పోర్టల్ వేగంగా ఉంటుందనుకుంటే మునుపటి కంటే నెమ్మదిగా ఉందని, పాత ఫీచర్లు సైతం సరిగా పనిచేయడం లేదు
చివరకు పాస్వర్డ్ మార్చాలన్నా కొన్ని నిమిషాల పాటు వేచి చూడాల్సి వస్తుందని మరొక చార్టర్డ్ అకౌంటెంట్ చెప్పారు. గతంలో దాఖలు చేసిన ఈ-ఫైలింగ్ రిటర్న్స్ కూడా కనిపించడం లేదని పలువురు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పోర్టల్లో సాంకేతిక సమస్యలు తొలగించాలని కోరుతున్నారు.