శ్రీశైలం : ఉగాది పర్వదినం (ప్లవనామ సంవత్సరం) సందర్భంగా వెండి కొండపై వెలసిన భ్రమరాంబ సమేత మల్లికార్జునులను రథంపై అధిష్టించి క్షేత్ర పురవీధుల్లో ఊరేగించారు.
మంగళవారం సాయంత్రం ఈఓ కేఎస్ రామారావు ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాలు, అశేష భక్తజనం నడుమ మధ్య ఆదిదంపతుల రథోత్సవం వైభవంగా సాగింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
రథోత్సవానికి ముందుగా ఆలయ ప్రాంగణం నుంచి ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకువచ్చారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం రథాంగ పూజ, హోమం, రథాంగబలి పూజా కార్యక్రమాలు నిర్వహించి గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి సాత్విక బలి సమర్పించారు.
రథోత్సవాన్ని వీక్షించడంతో పాపాలు, కష్టాలు తొలిగి ఆయురారోగ్య, ఐశ్వర్యాలు ప్రాప్తిస్థాయని భక్తుల విశ్వాసం.
ఉగాది మహోత్సవములో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు.
భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా దేవస్థాన సిబ్బందితోపాటు కర్ణాటక సేవా సంఘాల ప్రతినిధులు కృషి చేశారు.
ఉగాది మహోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం రాత్రి శ్రీరమావాణి సేవిత రాజరాజేశ్వరీ అలంకారంలో భ్రమరాంబదేవి భక్తులను కటాక్షించింది.
అలంకారం మండపంలో మహా సంకల్పాన్ని పఠించి షోడోపచార పూజలు నిర్వహించారు. చతుర్భుజాలు కలిగిన అమ్మవారు పాశం, అంకుశం, పద్మం చెరుకుగడలతో
దర్శనమిచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి