ముంబై, మార్చి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. బ్యాంకింగ్, వాహన, చమురు రంగ షేర్లకు లభించిన మద్దతుతోపాటు దేశ ఆర్థిక రంగం పరుగులు పెడుతున్నట్లు వచ్చిన గణాంకాలు మార్కెట్లకు మరింత కిక్కునిచ్చాయి. ఇంట్రాడేలో 700 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ 73 వేల పైకి చేరుకున్నది. చివర్లో 526 పాయింట్లు లాభపడి 72,996.31 వద్ద ముగిసింది. 30 షేర్లలో 18 సూచీలు లాభపడగా, 12 నష్టాల్లో ముగిశాయి. మరో సూచీ నిఫ్టీ 118.95 పాయింట్లు అందుకొని 22,123.65 వద్ద స్థిరపడింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ షేర్లు పడిపోయినప్పటికీ ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ రంగ షేర్లు మెరిసాయి.
రిలయన్స్ 20 లక్షల కోట్లకు పైగా
రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ రూ.20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను అధిగమించింది. ఇంట్రాడేలో 4 శాతం లాభపడిన కంపెనీ షేరు.. చివరకు 3.60 శాతం వృద్ధితో రూ.2,987.85 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ మరో రూ.70,039 కోట్లు పెరిగి రూ.20,21,486.59 కోట్లకు చేరుకున్నది. ఇదిలా ఉంటే ఆటో దిగ్గజం మారుతి సుజుకీ రూ.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను అధిగమించింది.