9.3 శాతానికి తగ్గించిన మూడీస్ l 10.8 శాతానికి కుదించిన నోమురా
ముంబై, మే 11: కొవిడ్-19 ప్రభావం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాల్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కుదించాయి. వృద్ధి రేటు అంచనాల్ని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 13.8 శాతం నుంచి 9.3 శాతానికి కట్ చేసింది. మరోవైపు ఈ రేటును 12.6 శాతం నుంచి 10.8 శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థ నోమురా ప్రకటించింది. రెండోదశలో కొవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నందున, పలు రాష్ర్టాలు లాక్డౌన్ విధించడంతో వృద్ధి రేటు అంచనాల్ని తగ్గిస్తున్నట్లు ఇరు సంస్థలూ పేర్కొన్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో పటిష్టంగా కోలుకోవొచ్చని మూడీస్ అంచనావేసింది. 2022-23లో వృద్ధి రేటు అంచనాల్ని 6.2 శాతం నుంచి 7.9 శాతానికి మూడీస్ పెంచుతూ, తదుపరి సంవత్సరాల్లో 6 శాతం వృద్ధి చెందవచ్చని తెలిపింది. కొవిడ్ సంక్షోభం కారణంగా ప్రభుత్వం రెవిన్యూ స్వల్పంగా తగ్గవచ్చని, హెల్త్కేర్పై వ్యయం పెరగొచ్చని, ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11.8 శాతానికి చేరవచ్చని మూడీస్ అంచనాల్లో పేర్కొంది.
తగ్గిన విద్యుత్ డిమాండ్
జనసంచారం తగ్గినందున ఆర్థిక కార్యకలాపాలు మందగించాయని, గూగుల్ వర్క్ప్లేస్, రిటైల్, రిక్రియేషన్ మొబిలిటీ సూచీలు 10 శాతం తగ్గాయని, విద్యుత్ డిమాండ్ తాజా వారంలో 4.1 శాతం పడిపోయిందని నోమురా విడుదల చేసిన నోట్లో వివరించింది. గతేడాది లాక్డౌన్తో ముగిసిన ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.6 శాతం తగ్గినట్లు అధికారిక అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ 10.5 శాతం వృద్ధిచెందుతుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, కొవిడ్ రెండో దశ జూన్వరకూ కొనసాగితే వృద్ధి రేటు 8.2 శాతానికి కుంచించుకుపోవొచ్చని కొంతమంది విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.