ఆ ప్యాకేజీ.. ఈ ప్యాకేజీలంటూ ఊదరగొడుతున్న కేంద్ర ప్రభుత్వం.. కష్టాల్లో ఉన్న వ్యాపార, పారిశ్రామిక రంగాలను ఏ రీతిన ఆదుకుంటున్నదో సర్వేలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాయి. తాజాగా వచ్చిన మరో సర్వేలో చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ)లకు అప్పులిచ్చేటోళ్లే లేరని తేలింది. దేశంలో 83 శాతానికిపైగా చిన్న వ్యాపారులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నది.అడుగడుగునా డిజిటల్ మంత్రం జపిస్తున్న మోదీ సర్కారు.. ఎస్ఎంఈలను టెక్నాలజీపరంగా అప్డేట్ చేయడంలోనూ విఫలమైందని సర్వే పేర్కొనడం గమనార్హం.
ముంబై, సెప్టెంబర్ 18: వ్యాపారం లేదు.. చేద్దామంటే చేతిలో పైసలూ లేవు.. ఇది.. ఇప్పుడు భారతీయ చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ)ల దుస్థితి. కరోనా మహమ్మారితో మునుపెన్నడూలేని సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న వ్యాపారులను ఆదుకునేవారే కరువయ్యారు. ఆత్మనిర్భర్ భారత్ అంటూ లక్షల కోట్ల రూపాయల్లో ప్రకటించిన ప్యాకేజీలు.. ఎస్ఎంఈల ఆర్థిక ఇబ్బందుల్ని ఏమాత్రం తీర్చలేకపోయాయని ఓ తాజా సర్వేలో తేలిపోయింది. ఉద్దీపనలు లెక్కలకేనని రుజువైంది. ట్రేడ్ఇండియా సర్వేలో దేశవ్యాప్తంగా 83 శాతానికిపైగా ఎస్ఎంఈలు సరైన ఫైనాన్స్ లేక సతమతమవుతున్నాయని స్పష్టమైంది. కొవిడ్-19 దెబ్బకు వ్యాపారాలు లేక అల్లాడిపోతున్న ఎస్ఎంఈలకు చేయూతనిచ్చేవారే కరువయ్యారని, పెట్టుబడుల కొరత వేధిస్తున్నదని పేర్కొన్నది. రూ.5-50 కోట్ల ఆదాయం కలిగిన 50వేల ఎస్ఎంఈల అభిప్రాయాలు, అనుభవాలతో ఈ సర్వేను ట్రేడ్ఇండియా జరిపింది.
పాత పెద్ద నోట్ల రద్దు నుంచి ప్రతీ రంగంలో డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తున్న కేంద్రం.. కరోనాతో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. డిజిటల్ లావాదేవీలపై మాత్రం వ్యాపారుల్లో అవగాహనను పెంచ డం మరిచిందన్న విమర్శలున్నాయి.
ఎస్ఎంఈలను తక్షణమే ఆదుకునే దిశగా అటు ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ చర్యలు తీసుకోకపోతే నష్టమేనని సర్వే హెచ్చరించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా ఉన్న ఎస్ఎంఈలతో ఉద్యోగ, ఉపాధి కల్పన కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎస్ఎంఈల రక్షణ ఎంతో ముఖ్యమని గుర్తుచేసింది.
‘ఎస్ఎంఈలకు రుణ లభ్యత లేకుండాపోయింది. కరోనా నేపథ్యంలో అంతటా డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. దీంతో రుణాలను ఎలా పొందాలన్నదానిపై వ్యాపారుల్లో సరైన అవగాహన కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తున్నది. మెజార్టీ వ్యాపారాలు దెబ్బతిన్నాయి’ -సందీప్ ఛేత్రి, ట్రేడ్ఇండియా సీఈవో