ముంబై, ఏప్రిల్ 29: దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 37 శాతం పెరిగి 140 టన్నులకు చేరింది. గతేడాది జనవరి-మార్చిలో 102 టన్నులకే డిమాండ్ కనిపించింది. కరోనా సంబంధిత ఆంక్షలు తొలగిపోవడం, ధరలు దిగిరావడంతో పసిడికి ఆదరణ పెరిగినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తమ తాజా నివేదికలో తెలిపింది. విలువపరంగా 57 శాతం పెరుగగా, నిరుడుతో చూస్తే రూ.37,580 కోట్ల నుంచి 58,800 కోట్లకు ఎగిసింది. ఆభరణాల డిమాండ్ 39 శాతం ఎగబాకి 73.9 టన్నుల నుంచి 102.5 టన్నులను తాకింది. విలువలో 58 శాతం వృద్ధి చోటుచేసుకోగా, రూ.27,230 కోట్ల నుంచి 43,100 కోట్లకు చేరింది.
క్షీణించిన గ్లోబల్ డిమాండ్
భారత్లో పసిడికి ఆదరణ కనిపించినా.. ప్రపంచవ్యాప్తంగా మాత్రం 23 శాతం తగ్గింది. ఈ జనవరి-మార్చిలో 815.7 టన్నులకే పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 1,059.9 టన్నులకు డిమాండ్ వ్యక్తమైంది. పెట్టుబడులు కూడా 71 శాతం దిగజారాయి. గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి పెద్ద ఎత్తున ఉపసంహరణలు జరిగాయి. అయితే బంగారం కడ్డీలు, నాణేలపై పెట్టుబడులు మాత్రం 36 శాతం పెరిగినట్లు డబ్ల్యూజీసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
డబ్ల్యూజీసీ నివేదిక ముఖ్యాంశాలు
‘దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.47వేలకు దిగివచ్చింది. ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావం నుంచి కోలుకోవడం, పెండ్లిండ్ల సీజన్ కూడా తోడవడం కొనుగోళ్లను పెంచింది. ముఖ్యంగా నిరుడు ఆగస్టులో గరిష్ఠంగా రూ.56,000 పలికింది. ఈ క్రమంలోనే రూ.50వేల మార్కు దిగువకు చేరడంతో డిమాండ్ ఊపందుకున్నది’