సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో గాలిలో దుమ్ము తగ్గింది. గత రెండు మూడు నెలలతో పోల్చితే నగరంలోని పాశమైలారం, బొల్లారం ప్రాంతాలను మినహాయిస్తే నగరంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ వాయుకాలుష్యం సాధారణ స్థాయికి చేరుకుంది. వాస్తవానికి లాక్డౌన్ సడలింపులతో కాలుష్యం కాస్త పెరుగుతుందని భావించినప్పటికీ.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కల ప్రకారం నగరంలో జూన్ నెలలో కాలుష్య సూచి గ్రీన్ మార్కును నమోదు చేసుకుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలతో పోల్చినా.. జూన్లో మరింత కాలుష్య తగ్గడం హర్షించదగ్గ విషయంగా చెప్పవచ్చును. సాధారణంగా వాతావరణంలో పీఎం-10 సూచి 24 గంటలకు 100వరకు ఉండాలి.. అలాగే పీఎం 2.5 సూచి 60 వరకు సాధారణ స్థాయి ఉండాలి.. నగరంలో పాశమైలారంలో 76, బొల్లారంలో 51 వరకు ఉండగా, హెచ్సీయూ ప్రాంతంలో 26, సనత్నగర్లో 27, జూపార్కులో 25, ఇక్రిశాట్ ప్రాంతంలో 16 వరకు మాత్రమే ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో నగరంలోని అనేక పరిశ్రమలు తక్కువ సిబ్బందితో షిఫ్టుల వారీగా విధులను అమలు చేస్తుంటే.. దాదాపుగా ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోంను ప్రకటించాయి. అలాగే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండటం, స్కూళ్లు, కళాశాలలు మూతబడి చాలా రోజులు అవుతుంది. కరోనా మహమ్మారి తీవ్రరూపంను చూసిన ప్రజలు ప్రాణభయంతో బయటకు రాకుండా చాలా మంది ఇప్పటికీ ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఈ వాయుకాలుష్యంకు ప్రధాన కారకాలైన వాహనాల రద్దీ నగర రోడ్లపై తగ్గింది. పీసీబీ ప్రకటించిన వాయు కాలుష్య ఇండెక్స్ల ప్రకారం నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కాలుష్య నమోదు కేంద్రాల్లో ఎక్కువగా వాహనాల ద్వారానే వాయుకాలుష్యం వెలువడుతున్నట్లు స్పష్టం అవుతుంది. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కంటే వాహనాల నుంచి వెలువడే కాలుష్యమే అధికంగా ఉంటుందని, దుమ్ముధూళి కణాలు వాతావరణంలో తగ్గడానికి ప్రధాన కారణం వాహనాలేనని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే గత నాలుగైదు నెలల్లో ఎన్నడు లేని విధంగా వాయు కాలుష్యం తగ్గిందని పీసీబీ పర్యావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.
లాక్డౌన్ సమయంలో నగర రోడ్లపై వాహన రద్దీ తగ్గింది. ఆ సమయంలో ప్రభుత్వం నగరంలోని రోడ్లను రూ.కోట్లను వెచ్చించి ఆధునీకరించారు. అలాగే అన్ని ప్రధాన రోడ్లతోపాటు చిన్న చిన్న రోడ్లకు కూడా బీటీ వేశారు. దీంతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా.. పెద్దగా దుమ్ము, ధూళి లేవడం లేదని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే గత కొద్ది రోజులుగా వర్షం కురుస్తుండటంతో పెద్దగా దుమ్ము లేవడం లేదని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు.