రక్షణ శాఖతో రూ.1,188 కోట్ల డీల్
హైదరాబాద్, మార్చి 19: మిలాన్ 2టీ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణుల తయారీ, సరఫరా కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఒప్పందం కుదుర్చుకున్నది. రక్షణ మంత్రిత్వ శాఖతో జరిగిన ఈ కాంట్రాక్ట్ విలువ రూ.1,188 కోట్లు. శుక్రవారం ఈ ఒప్పందంపై రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి దీప్తీ మోహిల్ చావ్లా (ఏఎం/ఎల్ఎస్), బీడీఎల్ ఈడీ (మార్కెటింగ్) టీఎన్ కౌల్ (రిటైర్డ్) సంతకాలు చేశారు. ఈ ఒప్పందం తమ సంస్థ ఆర్డర్ల బుక్కు మరింత బలాన్నిచ్చిందని బీడీఎల్ సీఎండీ సిద్ధార్థ్ మిశ్రా (రిటైర్డ్) ఈ సందర్భంగా విడుదలైన ఓ ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు.