న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దేశ ఆర్ధిక వ్యవస్థ భారీగా పుంజుకుంటుందని హెచ్డీఎఫ్సీ లైఫ్ చైర్మన్ దీపక్ ఫరేఖ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జీడీపీ 8 నుంచి 10 శాతం వరకూ పెరుగుతుందని అంచనా వేశారు. కరోనా ఫస్ట్ వేవ్తో పోలిస్తే ఆర్ధిక వ్యవస్ధపై సెకండ్ వేవ్ ప్రభావం పరిమితంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఫస్ట్ వేవ్లో దేశంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవగా సెకండ్ వేవ్లో ఆక్సిజన్, మందుల సరఫరాల వంటి కనీస సదుపాయాలకు కొరత ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కరోనా సెకండ్ వేవ్ ముమ్మర దశ నుంచి క్షీణస్తోందని, అయితే ఇప్పటికే మనం 4 లక్షలకు పైగా విలువైన ప్రజల ప్రాణాలను కోల్పోయామని దీపక్ పరేఖ్ ఆందోళన వ్యక్తం చేశారు.
సెకండ్ వేవ్ ప్రభావం జూన్ క్వార్టర్ వరకే ఉంటుందని చెప్పారు. హెచ్డీఎఫ్సీ లైఫ్ వాటాదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మహమ్మారి ప్రభావంతో ప్రజల్లో ముఖ్యంగా యువతలో జీవిత బీమాపై అవగాహన పెరిగిందని అన్నారు. ఇక బీమాలో ఎఫ్డీఐ పరిమితి 74 శాతానికి పెంచడం కూడా బీమా రంగానికి ఊతమిస్తుందని పేర్కొన్నారు.