న్యూఢిల్లీ, అక్టోబర్ 19: తక్కువ ధరకే ఆకర్షణీయమైన, విలువైన ఆస్తులను సొంతం చేసుకోవాలనుకునేవారికి అద్భుతమైన అవకాశం. డిఫాల్టర్ల నుంచి రుణ బకాయిలను వసూలు చేసుకోవడం కోసం వారు తాకట్టు పెట్టిన ఆస్తులను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వేలం వేస్తున్నాయి. ఈ నెల 22న బీవోబీ, 25న ఎస్బీఐ మెగా ఈ-ఆక్షన్లను నిర్వహించనున్నాయి. ఎస్బీఐ ఈ-వేలంలో వెయ్యికిపైగా ఓపెన్ ప్లాట్లు, నివాస, పారిశ్రామిక, వాణిజ్య ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారు. బీవోబీ సైతం సర్ఫేసీ చట్టం కింద రుణ ఎగవేతదారుల ఇండ్లు, ఫ్లాట్లు, కార్యాలయ స్థలాలు, భూములు/ప్లాట్లు, పారిశ్రామిక ఆస్తులను అమ్మకానికి పెడుతున్నది. కాగా, ఆస్తుల వేలానికి సంబంధించి ప్రము ఖ పత్రికలతోపాటు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర మీడియాల్లోనూ ప్రకటనలు ఇస్తామని ఎస్బీఐ తెలిపింది.
రుణ సదుపాయం
అర్హులైన కొనుగోలుదారులకు బ్యాంకులు సులభంగానే రుణ సదుపాయాలనూ సమకూర్చనున్నాయి. క్లియర్ టైటిల్, వెంటనే స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉండటంతో వేలంలో పెద్ద ఎత్తున కస్టమర్లు పాల్గొనవచ్చని బ్యాంక్ అధికారులు భావిస్తున్నారు. వివరాల కోసం బ్యాంకుల అధికారిక వెబ్సైట్లను ఆసక్తిగలవారు సందర్శించవచ్చు.