పాఠశాలల మరమ్మత్తుకు రంగం సిద్ధం
జిల్లాలోని 127 స్కూళ్లలోపనుల జాబితా సేకరణ
మేలో పూర్తి చేసేందుకుఏర్పాట్లు..
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 26: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. అందులో భాగంగా ఈ ఏడాది రూ.2వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఖర్చు చేయనుంది. జిల్లాలోని 127 పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అం దాయి. ఇంజినీరింగ్ శాఖ అధికారులు రెండు రోజులుగా పాఠశాలలను సందర్శిస్తూ చేపట్టాల్సిన పనుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు.
ప్రణాళికలు సిద్ధం..
జిల్లాలోని 18మండలాల్లోని హైస్కూళ్లలో మొదటి విడుతగా పాఠశాలలను మరమ్మతు చేయడానికి నిర్ణయించారు. ఇందులో ఎంపిక చేసిన పాఠశాలల్లోని తరగతి గదుల్లో మేజర్, మైనర్ మరమ్మతులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 278 మేజర్, 354 గదుల మైనర్ రిపేర్లు చేయడానికి అధికారులు ఆయా పాఠశాలలను పరిశీలించి కొలతలు నమోదు చేసుకుంటున్నారు. ప్రణాళికలు సిద్ధం చేసి రెండు మూడు రోజుల్లో రాష్ట్రస్థాయి అనుమతుల కోసం పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో పాఠశాలలకు రంగులు, టాయ్లెట్ల మరమ్మతు, తాగునీటి సౌకర్యం, ఇంటర్నల్ విద్యుత్ కనెక్షన్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు ఇలా అన్ని రకాల పనులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
కార్పొరేట్కు ధీటుగా..
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభంలోపు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చి వేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు చేయనుంది. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది రూ.2వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సౌకర్యాలన్నింటినీ కల్పించాలని నిర్ణయించారు.