హైదరాబాద్, జూన్ 16: నిన్న ఫార్మా.. నేడు ఐటీ.. రేపు డాటా.. కీలక రంగాలకు ఇప్పుడు హైదరాబాదే కేరాఫ్ అడ్రస్. ప్రభుత్వ, ప్రైవేట్ గణాంకాలైనా.. రేటింగ్ ఏజెన్సీలైనా అదే చెప్తున్నాయి. తాజాగా గ్లోబల్ రియల్ ఎస్టేట్ దిగ్గజం జేఎల్ఎల్ సైతం ఇదే అంటున్నది. డాటా సెంటర్ హబ్గా హైదరాబాద్ మారబోతున్నదని తెలిపింది. 2021-23లో భాగ్యనగర డాటా సెంటర్ సామర్థ్యం మరో 66 మెగావాట్లు పెరగవచ్చని ‘2020 ఇండియా డాటా సెంటర్ మార్కెట్ అప్డేట్’ పేరుతో విడుదల చేసిన తమ నివేదికలో జేఎల్ఎల్ అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుకూల డాటా సెంటర్ విధానం.. హైదరాబాద్ డాటా సెంటర్ హబ్గా మారడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నదని పేర్కొన్నది.
పెరిగిన వినియోగం
పెరుగుతున్న ఈ-కామర్స్, ఎడ్టెక్, డిజిటల్ లావాదేవీల వినియోగం.. ఆయా సంస్థల ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నది. గతేడాది మొత్తం డాటా వినియోగం 36 శాతం పెరిగింది. ఇందుకు కారణం స్మార్ట్ఫోన్లు, ఇతర ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ల వాడకమేనని నోకియా మొబైల్ బ్రాడ్బాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ 2021 తేల్చింది. 5జీ రాకతో డాటా వినియోగం ఇంకా పెరుగవచ్చని అంచనా. మరోవైపు పెరిగే డాటా సెంటర్లతో రియల్ ఎస్టేట్ రంగానికీ లాభం చేకూరనున్నది. 2021-23 నాటికి దేశీయ డాటా సెంటర్ పరిశ్రమ మరో 560 మెగావాట్లు అందిపుచ్చుకోవచ్చని అంచనా. దీంతో 60 లక్షల చదరపు అడుగుల స్థలానికి డిమాండ్ పెరుగుతుందని జేఎల్ఎల్ తెలిపింది.
‘ఓ కొత్త డాటా సెంటర్ హాట్స్పాట్గా హైదరాబాద్ ఎదుగుతున్నది. ప్రభుత్వ విధానాలు, పోటీయుత నిర్మాణ వ్యయం, భారీ డిమాండ్ ఇందుకు కారణం. డాటా సెంటర్ సదుపాయాల్లో ప్రస్తుతం నగర వాటా 7 శాతం. 2023 నాటికి 10 శాతానికి పెరుగవచ్చు. హైదరాబాద్లోని ప్రముఖ గ్లోబల్ క్లౌడ్ సంస్థల్లో ఒకటి ఇక్కడ గ్రీన్ఫీల్డ్ డాటా సెంటర్ క్యాంపస్ను తీసుకువస్తుండటం వృద్ధికి దోహదం చేస్తున్నది’
-సందీప్ పట్నాయక్, జేఎల్ఎల్ తెలంగాణ, ఏపీ అధిపతి