రోజురోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటివల్ల జరిగే ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్డీఏఐ) కొత్త సైబర్ ఇన్సూరెన్స్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు సైబర్ నేరాలను కవర్ చేసేలా కొత్త పాలసీలను జారీ చేయనున్నాయి. గత 18 నెలల కాలంలో సైబర్ నేరాలు 500 శాతం పెరిగినట్టు ఐఆర్డీఏఐ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో వ్యక్తులు, సంస్థలకు సైబర్ నేరాలతో జరిగే నష్టాల నుంచి రక్షణ కల్పించేందుకు సైబర్ ఇన్సూరెన్స్ అత్యుత్తమ రిస్క్ మేనేజ్మెంట్ సాధనం కాగలదని ఐఆర్డీఏఐ భావిస్తున్నది. సైబర్ ఫ్రాడ్స్, డాటా దొంగతనం, మాల్వేర్ తదితర నేరాలతో జరిగే ఆర్థిక నష్టాలకు ఈ పాలసీల ద్వారా రక్షణ లభించనున్నది.
ఇంటర్నెట్ వినియోగం పెరిగేకొద్దీ వ్యక్తిగత డాటా రిస్క్లు వెన్నంటే ఉంటాయి. ఈ కొత్త సైబర్ ఇన్సూరెన్స్ రాకతో సైబర్ అటాక్స్, థ్రెట్స్ వల్ల ముఖ్యమైన ఆర్థిక డాటా, సెన్సిటివ్ సమాచారం చోరీకి గురైతే జరిగే నష్టాలను తగ్గిస్తాయి. ప్రస్తుతానికి ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి కొన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు వ్యక్తులకు మాత్రమే పరిమితంగా సైబర్ ఇన్సూరెన్స్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సైబర్ పాలసీ.. ఫస్ట్, థర్డ్ పార్టీ కవరేజిని ఇస్తున్నాయి. ఈ పాలసీల్లో ఫోరెన్సిక్, డాటా పునరుద్ధరణ, డాటా భద్రత వ్యయాల వంటివి కూడా కవర్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, మొబైల్ వ్యాలెట్ల వంటి వాటికి సంబంధించిన సైబర్ క్రైమ్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నారు. వీటితోపాటు ఈ-మెయిల్ ఫిషింగ్, స్పూఫింగ్లు కూడా కవర్ అవుతాయి. సైబర్ ఇన్సూరెన్స్ కవరేజినిబట్టి రూ.600 నుంచి రూ.10,000 వరకు వార్షిక ప్రీమియం ఉంటుంది. అయితే ఈ పాలసీలను తీసుకునే ముందే ఏవి కవర్ అవుతాయో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తీసుకోవడం బెటర్.
ఎల్ఐసీ పాలసీ ఆగిందా?
వివిధ కారణాలతో ప్రీమియం చెల్లించలేక పాలసీలు లాప్స్ అయినవారు తిరిగి రెన్యువల్ చేయించుకోవడానికి ఈ నెల 22వ తేదీ వరకు అవకాశాన్ని కల్పిస్తున్నది ఎల్ఐసీ. ఆలస్య రుసుములో 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపునూ ఆఫర్ చేస్తున్నది. లక్ష రూపాయల వరకు ప్రీమియం బకాయి ఉంటే 20 శాతం లేదా రూ.2,000 వరకు రాయితీ అందుతుంది. అలాగే రూ.3 లక్షలకుపైగా బకాయి ఉంటే 30 శాతం లేదా రూ.3,000 వరకు రాయితీని కల్పిస్తున్నది. సాధారణంగా ప్రతి బీమా పాలసీకి రెన్యువల్ గడువు తర్వాత 15 నుంచి 30 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది.