న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు శరవేగంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2022 నాటికి బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లను దాటుతుందని తెలుస్తున్నది. అదే జరిగితే, మనదేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది.
సప్లయి, డిమాండ్కు అనుగుణంగా ముడి చమురు ధర పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా రీసెర్చిలో తేలింది. దీని ప్రకారం 2022 చివరి నాటికి బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లను దాటేస్తుందని పేర్కొంది.
కరోనా నియంత్రణకు గతేడాది విధించిన లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకున్నాయి. అటుపై ముడి చమురు కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది.
ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడంతో వచ్చే 18 నెలల్లో ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. ముడి చమురు నిల్వలు తక్కువగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు కారణం అని తెలుస్తున్నది.