Paytm IPO Crisis | ఆన్లైన్ పేమెంట్స్ సర్వీసెస్ సంస్థ పేటీఎం ఐపీవోను నిలువరించాలని దాఖలైన పిటిషన్పై మూడు వారాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సోమవారం ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి అనిమేశ్ కుమార్.. ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. పేటీఎం మాజీ డైరెక్టర్ అశోక్ కుమార్ సక్సేనా దాఖలు చేసిన పిటిషన్ను అనిమేశ్ కుమార్ విచారించారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చేనెల 13న చేపట్టనున్నది.
అశోక్ కుమార్ సక్సేనా (71) అనే పేటీఎం మాజీ డైరెక్టర్.. గత నెలలో ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేటీఎం ఐపీవోను నిలువరించాలని కోరారు. 20 ఏండ్ల క్రితం పేటీఎం సంస్థలో 27,500 డాలర్లు పెట్టుబడులు పెట్టానని, ఇప్పటి వరకు ఒక్క షేర్ కూడా పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏండ్ల క్రితం అశోక్ సక్సేనా పెట్టిన పెట్టుబడి 27,500 డాలర్లు ఈనాడు సుమారు రూ.20.35 లక్షలు ఉంటుంది.
పేటీఎంపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించాలని అశోక్ కుమార్ సక్సేనా గత నెలలో ఢిల్లీ కోర్టును అభ్యర్థించారు. తమ సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టివేయడానికే అశోక్ కుమార్ సక్సేనా ప్రయత్నిస్తున్నారని పోలీసులకు పేటీఎం వివరణ ఇచ్చింది.
ఇదిలా ఉంటే పేటీఎం ఐపీవోను నిలువరించాలని అశోక్ కుమార్ సక్సేనా.. సెబీని కూడా ఆశ్రయించారు. ఒకవేళ పేటీఎం ఐపీవోను నిలువరించకపోతే ఇన్వెస్టర్లు నష్టపోతారని పేర్కొన్నారు. పేటీఎం ఐపీవోను అనుమతించాలా.. లేదా.. అన్న విషయాన్ని సెబీ నిర్ణయిస్తుంది. అశోక్ కుమార్ సక్సేనా ఫిర్యాదు వల్ల పేటీఎం ఐపీవోకు అనుమతి జాప్యం కావచ్చునని ఓ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అధికారి చెప్పారు.