న్యూఢిల్లీ, ఆగస్టు 4: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు, శ్లాబులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార, పారిశ్రామిక సంఘం పీహెచ్డీసీసీఐ బుధవారం విజ్ఞప్తి చేసింది. గరిష్ట రేటును 18 శాతంగానే నిర్ణయించాలని, మొత్తం 3 శ్లాబులకే పరిమితం చేయాలని సూచించింది. కరోనా నేపథ్యంలో మార్కెట్లో పడిపోయిన కొనుగోళ్లు, వినీమయ సామర్థ్యం.. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణతో బలపడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అలాగే పన్నుల ఎగవేతకు అడ్డుకట్ట పడగలదన్న విశ్వాసాన్ని కనబరిచింది. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం రేట్లు అమలవుతున్నాయి. లగ్జరీ, పొగాకు తదితర ఉత్పత్తులపై గరిష్టంగా 28 శాతం పన్ను వేస్తున్నారు. అలాగే బంగారం, వెండి, సానబెట్టిన వజ్రాలపై ప్రత్యేకంగా 3 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో కనిష్ట రేటుగా 5 శాతాన్ని కొనసాగిస్తూ, 12, 18 శాతం శ్లాబులను కలిపేసి 12 శాతంగా, 28 శాతాన్ని ఎత్తేసి దాని స్థానంలో 18 శాతాన్ని పెట్టాలని పీహెచ్డీసీసీఐ అధ్యక్షుడు సంజయ్ అగర్వాల్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇప్పుడు 28 శాతం శ్లాబులో కొనసాగుతున్న దాదాపు 200 వస్తూత్పత్తులను 18 లేదా 12 శాతం శ్లాబుల్లోకి మార్చాలని కోరారు.