న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా దేశ పౌరులందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకున్నది. అయితే, అత్యంత మారుమూల ప్రాంతాల్లో, అందుబాటులో లేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని సంకల్పించింది.
ఇందుకోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తరఫున కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్ఎల్ఎల్ అనుబంధ హెచ్ఎల్ఎల్ ఇన్ఫ్రాటెక్ టెండ్లర్లను ఆహ్వానిస్తున్నది. డ్రోన్లు నిర్వహించే సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నది.
ఈ నెల 22న హెచ్ఎల్ఎల్ ఇన్ఫ్రా టెక్ టెండర్లను తెరవనున్నది. మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లతోపాటు ఇతర అత్యవసర ఔషధాలను డ్రోన్ల ద్వారా సరఫరా చేయనున్నది. ఈ డ్రోన్లు కనీసం 35 కిలో మీటర్ల దూరం వెళ్లి, వ్యాక్సిన్లు పంపిణీ చేసి తిరిగి రాగల సామర్థ్యం కలిగి ఉండాలి.
డ్రోన్ కనీసం నాలుగు కిలోల సరుకు రవాణా చేయగల శక్తి ఉండాలి. ప్యారాచూట్ సాయంతో సరుకు పంపిణీని అనుమతించరు. కేంద్ర పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ప్రమాణాలకు అనుగుణంగా డ్రోన్ బరువు ఉండాలి.
సంబంధిత డ్రోన్ల కంపెనీలతో తొలుత 90 రోజుల గడువు గల ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఐసీఎంఆర్ ప్రయోగాత్మకంగా డ్రోన్లతో డెలివరీ చేపట్టింది.
ఐఐటీ-కాన్పూర్ సాయంతో రూపుదిద్దుకున్న డ్రోన్లతో పైలట్ ప్రాతిపదికన ఐసీఎంఆర్ వ్యాక్సిన్ల పంపిణీ నిర్వహించింది. తద్వారా డ్రోన్లతో వ్యాక్సిన్ల పంపిణీకి ప్రమాణాలను ఖరారు చేసింది.