పనితీరుపై సెకండ్ వేవ్ ప్రభావం
క్యూ1లో రూ.7,922 కోట్ల లాభం
ముంబై, జూలై 17: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏకీకృత నికర లాభం ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 14 శాతం పెరిగి రూ.7,922.09 కోట్లుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో రూ.6,927.24 కోట్లుగా ఉన్నది. అయితే ఈ ఏడాది జనవరి-మార్చితో చూస్తే తగ్గుముఖం పట్టింది. నాడు రూ.8,434 కోట్ల ఏకీకృత లాభాన్ని అందుకున్నది.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం.. బ్యాంక్ పనితీరుపై పడిందని శనివారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. స్టాండలోన్ ఆధారంగా బ్యాంక్ పన్ను అనంతర లాభం ఈ ఏప్రిల్-జూన్లో రూ.7,730 కోట్లుగా ఉంటే, పోయినసారి రూ.6,659 కోట్లుగా ఉన్నది.
ఈ జనవరి-మార్చిలో రూ.8,187 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 8.57 శాతం పెరిగి రూ.17,009 కోట్లుగా ఉన్నది. రుణాల మంజూరు 14.4 శాతం పెరగడం కలిసొచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది.
టెక్నాలజీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలను 85 శాతం అమలు చేశామని, ఇక కొత్త క్రెడిట్ కార్డుల జారీపై నిషేధం ఎప్పుడు ఎత్తివేస్తారన్నది సెంట్రల్ బ్యాంక్ చేతిలోనే ఉన్నదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగ్దీశన్ అన్నారు. శనివారం బ్యాంక్ అధిపతి హోదాలో తన తొలి వార్షిక సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాటాదారులనుద్దేశించి మాట్లాడుతూ టెక్నాలజీ ఆడిట్ పూర్తయ్యిందని, బ్యాంక్పై తీసుకున్న చర్యల్ని ఎప్పుడు తొలగిస్తారన్నది ఆర్బీఐకే తెలుసన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపై విసిగిపోయిన ఆర్బీఐ.. గతేడాది డిసెంబర్లో మునుపెన్నడూ లేనివిధంగా చర్యలకు దిగిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే కొత్త క్రెడిట్ కార్డుల జారీపై నిషేధం విధించింది. అలాగే ఎటువంటి నూతన డిజిటల్ ఆఫర్లు పరిచయం చేయరాదని స్పష్టం చేసింది. దీంతో క్రెడిట్ కార్డ్ మార్కెట్లో లీడర్గా ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు పెద్ద దెబ్బే తగిలింది.