నల్లగొండ, జూన్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓటమి ఖాయమని, ఆయన్ను ఆ దేవుడు కూడా గెలిపించలేడని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలి చైర్మన్ పదవీకాలం ముగిసిన సందర్భంగా గురువారం నల్లగొండలోని తన నివాసంలో కలిసిన మీడియా ప్రతినిధులతో గుత్తా చిట్చాట్ చేశారు. అనేక విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, కేవలం ఆత్మహత్యలే ఉంటాయని, అందుకు తాజా ఉదాహరణ ఈటల వ్యవహారమేనని స్పష్టం చేశారు. ఈటలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చినా రాజకీయంగా తనను తానే నాశనం చేసుకునేలా వ్యవహరించినట్టు తెలిపారు. నిజంగా ఈటల తనకు తానుగా శక్తిమంతునిగా భావించుకుంటే స్వతంత్రంగా నిలబడేవాడని, అలా కాకుండా బీజేపీలో చేరడం తన మీద తనకే నమ్మకం లేనట్లుగా ఉన్నదని పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం కాదని, ఆస్తుల రక్షణ కోసమే ఈటల బీజేపీలోకి వెళ్తున్నాడని విమర్శించారు.
పడిపోతున్న మోదీ గ్రాఫ్..
దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ రోజురోజుకూ దిగజారుతుందని గుత్తా వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కరోనా ప్రమాదాన్ని ముందే అంచనా వేసి కట్టడి చేయడంలో విఫలమయ్యారన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల పోటు నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించలేకపోయారని మండిపడ్డారు. కేంద్రం గొప్పగా చెప్పుకోవడానికి ఒక్క కొత్త పథకం కూడా లేదన్నారు. అందుకే రాష్ట్రంలోనూ బీజేపీకి భవిష్యత్తు లేదని అభిప్రాయపడ్డారు.
చైర్మన్ పదవిలో సంతృప్తికరంగానే..
సీఎం కేసీఆర్ తనకు శాసనమండలి చైర్మన్ లాంటి అత్యున్నత పదవీ బాధ్యతలు అప్పగించారని, తన పదవీ కాలం సంతృప్తికరంగా సాగిందని గుత్తా తెలిపారు. తన తండ్రి గుత్తా వెంకట్రెడ్డి పేరిట మోమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన కుమారుడు అమిత్రెడ్డి సారథ్యంలో రాజకీయాలకు అతీతంగా నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కుమారుడు అమిత్రెడ్డి రాజకీయ అరంగేట్రం కోసమే ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ప్రస్తుత రాజకీయాల్లోకి ఇష్టంతో రావాలని, ఆటుపోట్లను తట్టుకుని నిలబడితేనే రాణించగలరని చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడి ఇక్కడి వరకు రాగలిగానని తెలిపారు. తన కుమారుడు అమిత్రెడ్డి క్రమశిక్షణతో పెరిగాడని, ఏదైనా అనుకుంటే సాధించే వరకు పట్టువిడవకుండా కృషి చేయడం అలవాటని చెప్పారు. ట్రస్ట్ పేరుతో తన కుటుంబ సభ్యులు ఎంతోమంది కరోనా బాధితులకు అండగా నిలువడం సంతోషం కలిగిస్తున్నదని గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు.
అత్యంత బలమైన పార్టీ టీఆర్ఎస్సే..
టీఆర్ఎస్ అత్యంత బలమైన పార్టీగా ఉన్నదని, రానున్న ఇరవై ఏండ్లు కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్దే అధికారమని గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలవుతున్నాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో అనతికాలంలోనే దేశంలో రాష్ట్రం అగ్రస్థానానికి చేరువలో ఉన్నదన్నారు. కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఎన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నా.. సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచి కొనుగోళ్లను పూర్తి చేయించారని చెప్పారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 24 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందంటే మామూలు విషయం కాదన్నారు.