న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: మొన్న అయాన్స్.. నిన్న నౌకరీ.. నేడు మ్యాన్పవర్.. సంస్థ ఏదైనా, ఎక్కడి నుంచి రిపోర్ట్ చేసినా చెప్పేది మాత్రం ఒక్కటే. దేశంలో జాబ్ మార్కెట్ పుంజుకున్నదని, రాబోయే నెలల్లో నియామకాలు జోరుగా ఉంటాయనే. మ్యాన్పవర్గ్రూప్ ఇండియా విడుదల చేసిన మ్యాన్పవర్గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే తాజా నివేదికలోనూ వచ్చే మూడు నెలల్లో మరింత మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని 44 శాతం సంస్థలు భావిస్తున్నట్లు తేలింది. గడిచిన ఏడేండ్లలో ఈ స్థాయిలో కార్పొరేట్ల నుంచి కొత్త కొలువులపట్ల సానుకూల స్పందన రావడం ఇదే తొలిసారి. కరోనా నేపథ్యంలో మందగించిన నియామకాల ప్రక్రియను తిరిగి కంపెనీలు వేగిరం చేస్తున్నాయి మరి. ఈ సర్వేలో 3,046 సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్లోగా మరింత మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని మెజార్టీ సంస్థలు తెలిపాయి.
మార్కెట్ కళకళ
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టి మార్కెట్ మళ్లీ కళకళలాడుతుందన్న అభిప్రాయం చాలా సంస్థల నుంచి వచ్చింది. ఈ క్రమంలోనే ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి అమ్మకాలు పుంజుకుంటాయని, సేవలకు ఆదరణ లభించగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. అందుకే తాము నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ‘దేశీయ కార్పొరేట్లు రికవరీపై విశ్వాసంతో ఉన్నారు. మార్కెట్లో మళ్లీ సాధారణ పరిస్థితులు త్వరలోనే నెలకొంటాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే అన్ని రంగాల్లోనూ నియామకాలకు సంస్థలు సిద్ధం అవుతున్నాయి.’ అని మ్యాన్పవర్గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ తెలిపారు.
వ్యాక్సిన్తో కిక్కు
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతుండటం కూడా కలిసొస్తున్నదని మ్యాన్పవర్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కార్పొరేట్ల ఉత్సాహానికి వ్యాక్సినేషన్ ఎంతగానో దోహదం చేసిందని గులాటీ అన్నారు. ముఖ్యంగా పండుగ సీజన్లో విక్రయాలు పుంజుకుంటాయన్న ఆశాభావం కనిపిస్తున్నది. సేవలు, తయారీ, ఆర్థిక, బీమా, నిర్మాణ రంగాల్లో కొత్త కొలువులకు అవకాశాలు మెరుగైనట్లు చెప్పారు. అయితే థర్డ్ వేవ్ ఆందోళనలూ కనిపిస్తున్నాయని, చాలా పరిశ్రమలకు ఇది ప్రతిభావంతుల కొరతను తెచ్చిపెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. శిక్షణ, నైపుణ్యాభివృద్ధి ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయన్నారు.