భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటక ప్రాంతమైన సట్కోసియా ఎకో రిట్రీట్ క్యాంప్లో మూడు గుడారాలకు మంటలు అంటుకుని ఖాళీ బూడిదయ్యాయి. ఈ ప్రమాదం నుంచి దంపతులైన ఇద్దరు ఐపీఎస్ అధికారులు తృటిలో తప్పించుకున్నారు. వారు మంటలను గమనించడం ఏమాత్రం ఆలస్యమైనా ఇద్దరూ గుడారంలో ఖాలీ బూడిదయ్యేవారు.
వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎస్ అధికారి సంజీవ్ పాండా ఒడిశా రవాణాశాఖ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఐపీఎస్ అధికారే అయిన ఆయన సతీమణి సంతోష్ బాలా ఒడిశా హోంశాఖ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే వారిద్దరూ వ్యక్తిగత పర్యటనలో భాగంగా సట్కోసియా ఎకో రిట్రీట్ క్యాంప్లో బస చేశారు. అక్కడున్న మూడు తాత్కాలిక కాన్వాస్ టెంట్లలో ఒకదానిలో ఐపీఎస్ దంపతులు షెల్టర్ తీసుకున్నారు.
అయితే, ఆదివారం ఉదయం ఆ మూడు టెంట్లకు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడటంతో ముందే పసిగట్టిన ఐపీఎస్ దంపతులు బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. వారితోపాటు మిగతా టెంట్లలో ఉన్న వారు కూడా సురక్షితంగా బయటపడ్డారు. మొత్తానికి ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.