హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, రద్ధుచేసే అవకాశం లేదని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పష్టంచేశారు. పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పాస్చేసే ఆలోచన లేదని పేర్కొన్నారు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం మే 1నుంచి 20 వరకు జరుగుతాయని, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్నామని, రెండుమూడు రోజుల్లో హాల్ టికెట్లను జారీచేస్తామని వివరించారు. ఏప్రిల్ 1, 3 తేదీల్లో జరగాల్సిన ఇంటర్నల్ పరీక్షలను కరోనా నేపథ్యంలో ఇంటి వద్దే రాసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షల ప్రశ్నపత్రాలను విద్యార్థులకు అసైన్మెంట్ల రూపంలో ఇస్తామని, ఇంటివద్దే సమాధాలు రాసి, వారం పదిరోజుల్లో సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 7నుంచి 20 వరకు జరగాల్సిన ప్రాక్టికల్స్పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పరీక్షల నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేసి ప్రభుత్వానికి పంపించామని, మూడు ప్రత్యామ్నాయాలను ఆయా ప్రణాళికలో ప్రతిపాదించామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని వివరించారు.