న్యూఢిల్లీ: ఇటీవల ఓ తెలుగు సినిమాలో వదల బొమ్మాళీ.. నిన్ను వదల అని ఓ డైలాగ్.. ఇప్పుడు ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వదల మిమ్మల్ని వదల అంటోంది కరోనా మహమ్మారి. ఈ విశ్వమారి ప్రభావంతో దేశీయంగా పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగి వ్యక్తిగత వాహనాల కొనుగోలు పెరిగింది.
కానీ అంతర్జాతీయంగా ఆటోమొబైల్ రంగం కుదేలైందని గణాంకాలే చెబుతున్నాయి. 2019-20తో పోలిస్తే 2020-21లో విదేశాలకు వాహనాల ఎగుమతులు భారీగా తగ్గుముఖం పట్టాయి.
ప్రత్యేకించి ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులు రమారమీ 38.92 శాతం పడిపోయాయి. కరోనా వల్ల విదేశాలకు వాహనాల రవాణా కూడా సమస్యగా మారడం ఒక కారణమే.
ఆటో ఇండస్ట్రీ బాడీ.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) మాటల్లో చెప్పాలంటే గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వాహనాల ఎగుమతుల్లో భారీ క్షీణత నమోదైంది.
2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో విదేశాలకు 6,62,118 ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతి అయ్యాయి. కానీ గత ఆర్థిక సంవత్సరంలో అది 4,04,400 వాహనాలకే పరిమితమైంది. 2019-20తో పోలిస్తే ఇది 38.92 శాతం తక్కువ.
ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 44.32 శాతం పడిపోయాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 4,75,801 కార్లు ఎగుమతి చేస్తే.. గతేడాది అది 2,64,927 కార్లకే పరిమితమైంది.
యుటిలిటీ వాహనాల ఎగుమతుల్లో 24.88 శాతం తగ్గాయి. 2020-21లో 4,75,801 వెహికల్స్ ఎగుమతయ్యాయి. ఇక 2019-20లో 2,849 వ్యాన్లు ఎగుమతి అయితే, గతేడాది 42.16 శాతం పడిపోయి 1,648 యూనిట్లకు పరిమితం అయ్యాయి.
విదేశాలకు కార్ల ఎగుమతిలో దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మొదటి స్థానంలో నిలుస్తుంది. అయితే 2019-20తో పోలిస్తే 38.57 శాతం తగ్గాయి. గతేడాదిలో 1,04,342 ప్యాసింజర్ వెహికల్స్ మాత్రమే హ్యుండాయ్ ఎగుమతి చేసింది.
ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉన్న మారుతి సుజుకి స్వల్ప తేడాతో బయటపడింది. 2019-20తో పోలిస్తే మారుతి సుజుకి కార్ల ఎగుమతులు 5.34 శాతం తగ్గాయి. గతేడాది కేవలం 94,938 కార్లు మాత్రమే విదేశాలకు మారుతి సుజుకి ఎగుమతి చేసింది.
ఇక దేశీయంగా గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ రెండు శాతం తగ్గిపోయాయి. 2019-20తో పోలిస్తే 2020-21లో 2.24 శాతం తగ్గిపోయాయి. 2020-21లో ప్యాసింజర్ వాహనాల కొనుగోళ్లు 27,73,519 కార్ల నుంచి 27,11,457యూనిట్లకు పడిపోయాయి.