ఘట్కేసర్ రూరల్, మే 13: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైన మహిళ ఆచూకీ లభ్యమైంది. నగరంలోని ఓయూ సమీపంలోని మాణికేశ్వరీనగర్కు చెందిన ఒరుసు లత(29)గా గుర్తించారు. ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న అన్నోజిగూడలోని బాలా జీ ట్రేడర్స్ భవనంపై ఒంటిపై దుస్తులు లేకుండా కుళ్లిన దశలో ఉన్న గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగం గా ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వరకు ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించినా ఫలితం లేకుండా పోయింది. మృతురాలి ఫొటో ఆధారంగా మాణికేశ్వరీనగర్కు చెందిన ఒరుసు లతగా గుర్తించారు. హత్యకు గురైన మూడు రోజుల ముందు ఘట్కేసర్లోని మైసమ్మగుట్టలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చినట్లు గుర్తించారు. హత్యకు పాల్పడింది ఎవరనేది తెలియరాలేదు. నిందితుడి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.